కిషన్ రెడ్డి చర్చలు: కాంగ్రెసుకు గుడ్ బై, బిజెపిలోకి విజయశాంతి జంప్?
మాజీ ఎంపీ , సినీ నటి విజయశాంతితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చించారని ప్రచారం సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ చర్చలకు రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
హైదరాబాద్: మాజీ ఎంపీ , సినీ నటి విజయశాంతితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చించారని ప్రచారం సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ చర్చలకు రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
గతంలో మెదక్ ఎంపీ స్థానం నుండి ఆమె ప్రాతినిథ్యం వహించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయశాంతి పోటీ చేస్తారని గతంలో ప్రచారం సాగింది.
అయితే అనుహ్యంగా మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయననే కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది.
చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా మాణికం ఠాగూర్ నియమితులయ్యారు.
కొత్త ఇంచార్జీ రాష్ట్రానికి వచ్చిన సమయంలో కూడ విజయశాంతి రాలేదు. సంగారెడ్డిలో కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈ నెల 2వ తేదీన నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కూడ పాల్గొనలేదు.
విజయశాంతితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ అంశాలపై చర్చించారు. రాజకీయ పరమైన అంశాలు చర్చకు వచ్చాయా.. ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయమై తేలాల్సి ఉంది.