కేసీఆర్ కళ్లలో ఆనందం చూడటం కోసం, కల్వకుంట్ల కుటుంబ మెప్పు పొందడం కోసం విపక్ష నేతలను పోలీసులు వేధిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్ని అనేక వాహనాలు మార్చడమే కాకుండా, స్టేషన్లు తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెన్త్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్పై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు అధ్వాన్నంగా వ్యవహరించారని మండిపడ్డారు. కేసీఆర్ కళ్లలో ఆనందం చూడటం కోసం, కల్వకుంట్ల కుటుంబ మెప్పు పొందడం కోసం విపక్ష నేతలను వేధిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పరిపాలనా వైఫల్యాలను బీజేపీ ప్రశ్నిస్తోందని.. అందుకే ఆ పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తెగబడుతోందన్నారు. చేతిలో అధికారం వుందని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. మొన్నామధ్య ఓ మంత్రిని చంపేందుకు సుపారీ ఇచ్చారని కేసు పెట్టారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
బండి సంజయ్ని అనేక వాహనాలు మార్చడమే కాకుండా, స్టేషన్లు తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాంహౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏమైందో అందరికీ తెలుసునని, బండి సంజయ్ని మనో వేదనకు గురిచేశారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఉగ్రవాదుల విషయంలోనూ అలా వ్యవహరించరని.. విలేకరులను కూడా కేసీఆర్ వదిలిపెట్టడం లేదని కేంద్రమంత్రి ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో మీడియా సంస్థలపై నిషేధం విధించారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద మీడియా ప్రతినిధులు ఉద్యోగాలు చేస్తారని.. వారు కూడా రాజకీయ వ్యవస్థలో భాగమన్నారు.
Also Read: పదో తరగతి పేపర్ లీకేజ్ కేసు : ఎ1గా బండి సంజయ్, మిగతా నిందితులు వీరే
ఎంతమంది విలేకర్లు నేతలతో సన్నిహితంగా వుంటారని కిషన్ రెడ్డి తెలిపారు. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్కి బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, దాస్యం వినయ్ భాస్కర్లతోనూ మంచి సంబంధాలున్నాయని ఆయన వెల్లడించారు. అంటే వారికి కూడా పేపర్ లీక్లో ప్రమేయం వుందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీక్కు సంబంధించి మీడియాలో బ్రేకింగ్ వచ్చిన చాలాసేపటి తర్వాత సంజయ్ ఫోన్కి వచ్చిందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై బండి సంజయ్ పోరాడారని.. లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు.
ప్రజలు, మీడియా, రాజకీయ పార్టీల దృష్టిని మళ్లించడం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్యని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కేసులు, తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదన్నారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ ధర్నా చౌక్ ఎత్తివేశాడని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో సభలు పెట్టుకోవాలన్నా, పాదయాత్ర నిర్వహించుకోవాలన్నా కోర్టు మెట్లెక్కాల్సి వస్తోందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంత అణిచివేయాలని చూస్తే అంత బాగా బలపడతామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
