తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ఫై ఫైరయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు లేని పథకాలేంటో సీఎం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ఫై ఫైరయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు లేని పథకాలేంటో సీఎం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఆదివారం మేడ్చల్‌ జిల్లా ఫిర్జాదిగూడలో కిషన్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుద్యోగ యువత, ఉద్యోగులు టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌లో రూ.17వేల కోట్ల వ్యయంతో 350 కి.మీ రీజినల్‌ రింగు రోడ్డు ఏర్పాటు కానుందని.. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన గొప్ప కానుక ఇది అని కిషన్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు.

అంతకుముందు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ నిధులతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేకపోవడంతో పరోక్షంగా స్వతంత్రులకు మద్దతిస్తోందని సంజయ్ ఆరోపించారు.

ఎన్టీఆర్, పీవీ ఘాట్‌లను కూల్చుతామని ఒవైసీ అంటే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. భారత్ బయోటెక్‌కు ప్రధాని వస్తే కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదని సంజయ్ మండిపడ్డారు.

కేంద్రం ఏమీ ఇవ్వలేదని కేటీఆర్ అంటున్నారని.. అన్నీ ఇచ్చాక వీళ్లు పొడిచేది ఏం లేదంటూ చురకలు వేశారు. కేంద్రం నిధులు లేనిదే ఏ పథకం లేదని గోడకు వేసిన తుపాకీ తుప్పు పట్టిందంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు. 

20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు కేసీఆర్ నిరూపిస్తే కేసీఆర్‌కు తోమాల సేవ చేస్తానన్న ఆయన.. నిరూపించుకుంటే బడిత పూజ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.