Kishan Reddy: "నెహ్రూ సంప్రదాయాన్నే కాంగ్రెస్ ఇప్పటికీ అనుసరిస్తోంది"
Kishan Reddy: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించడం కాంగ్రెస్ దివాలా కోరుతనానికి నిదర్శనమనీ, అభద్రతా భావం, సూడో సెక్యూరలిస్టులుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్ హిందుత్వ వ్యతిరేక వైఖరి మరొకసారి బయటపడిందని మండిపడ్డారు.
![Union Minister G Kishan Reddy alleges Congress has anti-Hindu attitude since Nehru era KRJ Union Minister G Kishan Reddy alleges Congress has anti-Hindu attitude since Nehru era KRJ](https://static-ai.asianetnews.com/images/01hka622ae5737x2fp1jfpwzrn/kishan-reddy-jpg_363x203xt.jpg)
Ram Madir | అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడంపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తొలి ప్రధాని నెహ్రూ సంప్రదాయాన్నే కాంగ్రెస్ ఇప్పటికీ అనుసరిస్తోందని, కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక వైఖరి అని మండిపడ్డారు. స్వాతంత్య్రం అనంతరం నిర్మించిన సోమ్నాథ్ ఆలయ ప్రారంభోత్సవానికి తొలి ప్రధాని నెహ్రూ రాలేదనీ, ఆ సంప్రదాయాన్నే కాంగ్రెస్ ఇప్పటికీ అనుసరిస్తోందని విమర్శించారు.
రాజకీయాలకు అతీతంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు, సమాజంలోని అన్ని వర్గాలకు, ప్రముఖులకు శ్రీ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపిందని, ఈ కార్యక్రమం ఒక మతానికి పరిమితం కాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలో రోజురోజుకు ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ అభద్రతా భావంతో, సూడో సెక్యులరిజంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా వచ్చిన ఆహ్వానాన్ని మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, లోక్సభలో ఆధిర్ రంజన్ చౌదరి తిరస్కరించినట్లు కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. బిజెపి, ఆర్ఎస్ఎస్ ఎన్నికల లబ్ధి కోసం ఈ కార్యక్రమాన్ని "రాజకీయ ప్రాజెక్ట్"గా మార్చాయని ప్రతిపక్ష పార్టీ కూడా పేర్కొంది.
‘పవిత్ర కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ’ ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ మరోసారి హిందూ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అన్నారు. అయోధ్యలో రామమందిర విధ్వంసానికి వ్యతిరేకంగా చరిత్రలో పోరాటాలు చేసినప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు లేవని అన్నారు. ఇప్పుడు రామమందిర ప్రతిష్ఠాపన రాజకీయ కార్యక్రమం కాదు, హిందుత్వ కార్యక్రమం కూడా కాదన్నారు. అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ప్రతిరూపమని కాంగ్రెస్ అర్థం చేసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి "బహిష్కరణ" అలవాటు ఉందని, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రదానం చేసినప్పుడు, G-20 సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ఇలా ప్రతి కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. దేశ సంస్కృతిని, హిందువులను గౌరవించే విధంగా కాంగ్రెస్ పనిచేయడం లేదని, ఆ పార్టీ జీఎస్టీని ‘గబ్బర్ సింగ్ ట్యాక్స్’గా అభివర్ణించిందని, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని అన్నారు.
విదేశాల నుంచి నాయకత్వాన్ని దిగుమతి చేసుకున్న కాంగ్రెస్ భారతదేశానికి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతోందనీ, హిందుత్వ అనేది ఒక మతానికి సంబంధించినది కాదని, జాతీయ జీవన విధానమని అన్నారు. కాంగ్రెస్ కూటమిలోని రాష్ట్ర మంత్రులు కూడా'సనాతన ధర్మానికి' వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. దేశం సెక్యులర్గా ఉన్నందున హిందూ దేవాలయ పునరుద్ధరణకు హాజరుకాకూడదని నెహ్రూ ప్రసాద్కు లేఖ రాశారని ఆయన పేర్కొన్నారు.
నెహ్రూ నుంచి నేటి వరకు కుటుంబ రాజకీయాలు చేసిన కాంగ్రెస్ హిందూ వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తోందన్నారు. అయోధ్య నుంచి పవిత్ర అక్షతలు ప్రజలకు పంచుతున్నప్పుడు హైదరాబాద్లో పోలీసు కేసు నమోదైందని రెడ్డి ఆరోపించారు. భారతదేశంలో ఇలాంటి కేసు ఇదే మొదటిదని, ఏఐఎంఐఎంను ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానం స్పష్టంగా ఉందని ఆయన ఆరోపించారు.