నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్ పై జరిగిన దాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. ఈ మేరకు అర్వింద్ కు స్వయంగా ఫోన్ చేసిన ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్‌పై దాడి ఘటనతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) స్పందించారు. అర్వింద్ కాన్వాయ్ పై దాడి విషయం తెలియగానే.. ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆరా తీశారు. తననే కాకుండా బీజేపీ నేతలు, కార్యకర్తలను టీఆర్ఎస్ లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోందని అమిత్ షాకు అర్వింద్ వివరించారు. ఈరోజు తనపై జరిగిన దాడి వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యా సాగర్ హస్తం వుందని అర్వింద్ ఆరోపించారు.

అంతకుముందు అర్వింద్ పై దాడి ఘటనను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భౌతికదాడులకు తెగబడుతున్నారని ఆయన ఆరోపించారు. అర్వింద్ పై దాడి ముమ్మాటికీ పరికిపంద చర్యేనని... ప్రజాస్వామ్యవాదులంతా ఈ ఘటనను ఖండించాలని సంజయ్ కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి టైం దగ్గరపడిందని... అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఏం జరిగినా ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం ధర్మపురి అర్వింద్ పై దాడిని ఖండించారు. ప్రజల్లో బీజేపీకి వస్తోన్న ఆదరణ చూసి తట్టుకోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. 

ALso REad:ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్‌పై దాడి.. పిరికిపంద చర్య, భయపడేది లేదు : బండి సంజయ్

కాగా.. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్రదండిలో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ అరవింద్ ను గ్రామస్తులు, పలువురు నేతలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి, ఆయన కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో అర్వింద్ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 

ఇకపోతే.. నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే షకీల్ (trs mla shakeel) , బీజేపీ (bjp) ఎంపీ ధర్మపురి అర్వింద్ (dharmapuri arvind) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రజలు భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అర్వింద్ ఎక్కడున్నారని షకీల్ నిలదీశారు. సీఎం కేసీఆర్ ను విమర్శించడం తప్పించి ఆయన వేరే పని లేదా అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం తప్పించి.. కేంద్రం నుంచి తెలంగాణకు ఇంత వరకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని షకీల్ దుయ్యబట్టారు. ఇంతటి క్లిష్ట పరిస్ధితుల్లో ప్రజలను పట్టించుకోకుండా తిరుగుతోన్న అర్వింద్ ను చెప్పుతో కొట్టాలంటూ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎంపీ అర్వింద్ స్పందిస్తూ.. పందిని పట్టించుకోనంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం నివేదికలు పంపితే కేంద్రం సాయం చేస్తుందని.. కేసీఆర్ ప్రభుత్వానికి ఆ పని చేతకాదంటూ ఎద్దేవా చేశారు.