ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్ ఢిల్లీలో దీక్ష చేపట్టిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పారా బాయిల్డ్ రైస్ను కొనబోమని తేల్చిచెప్పింది. బియ్యం సేకరణపై కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపింది.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్ ఢిల్లీలో దీక్ష చేపట్టిన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పారా బాయిల్డ్ రైస్ను కొనబోమని తేల్చిచెప్పింది. తెలంగాణ ప్రభుత్వం బియ్యం సేకరణపై కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే అన్నారు. ప్రస్తుతం కేంద్రం ఏ రాష్ట్రం నుంచి పారా బాయిల్డ్ రైస్ తీసుకోవడం లేదని వెల్లడించారు. ముందుగా ఇచ్చిన సమాచారం మేరకే బియ్యం సేకరిస్తామన్నారు. రాష్ట్రాల నుంచి తీసుకోవాల్సిన బియ్యం ఇంకా ఉందనేది వాస్తవం అన్నారు.
ప్రస్తుతం ఎఫ్సీఐ ఏ రాష్ట్రంలోనూ పారాబాయిల్డ్ రైస్ తీసుకోవట్లేదని చెప్పారు. బియ్యం సేకరణ విషయంలో ఏ రాష్ట్రంపైనా వివక్ష ఉండదన్నారు. పంజాబ్ నుంచి ఒక్క గింజ కూడా బాయిల్డ్ రైస్ తీసుకోవడం లేదని వెల్లడించారు.2020-21లోనే పారా బాయిల్డ్ రైస్ను ఇవ్వమని, రా రైస్ మాత్రమే ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం రాత పూర్వకంగా చెప్పిందన్నారు.
ఎఫ్సీఐ దగ్గర మూడేళ్లకు సరిపడా పారా బాయిల్డ్ రైస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. పంజాబ్లో ధాన్యాన్ని మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తోందని చెప్పారు. ఒక ఏజెంట్గా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం సేకరిస్తాయని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఎలా కొంటున్నామో తెలంగాణలో కూడా అలాగే ధాన్యం సేకరిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి ఎంత రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామన్నారు. ఏపీ, తెలంగాణ రెండూ ఒకే జోన్లో ఉన్నాయని.. ఆంధ్రాలో రాని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. దేశమంతా ఇప్పటికే ఒకే ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అవలంభిస్తున్నామని చెప్పారు.
