తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ఏం చెప్పిందంటే..
దేశంలో గిరిజిన యూనివర్సిటీలు, గిరిజిన విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది.
దేశంలో గిరిజిన యూనివర్సిటీలు, గిరిజిన విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, కాంగ్రెస్ ఎంపీ గీత అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2020-21 ప్రకారం.. 24.10 లక్షల మంది గిరిజన విద్యార్థులు దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో చేరారని తెలిపారు. దేశంలో రెండు గిరిజన యూనివర్సిటీలు ఉన్నాయని చెప్పారు. అందులో ఒకటి మధ్యప్రదేశ్ అమర్కంఠక్లోని ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ, మరోకటి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అని పేర్కొన్నారు. ఇందులో 523 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు.
దేశంలో సెంట్రల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అవసరమైనప్పుడు వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీల ఏర్పాటుకు నిర్ణీత ప్రమాణం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదు.
ఇక, తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదన ఉందని తెలిపారు.