నిరుద్యోగులకు మళ్లీ నిరాశే.. ఖాళీల్లో పాత వారిని సర్దుపాటు చేసేందుకే సర్కార్ ప్రయత్నాలు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఖాళీగా ఉన్న స్థానాల్లో పాతవారినే సర్దుబాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థుల కలలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. గత ఏడాదిన్నరగా ఇవిగో ఉద్యోగాలు, అవిగో ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులకు ఆశలు చూపుతోంది. ప్రభుత్వం అప్పట్లో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ నిరుద్యోగ అభ్యర్థులు మళ్లీ పుస్తకాలు పట్టారు. పల్లెల్లో ఏదో ఒక పని చేస్తూ సెటిల్ అవుదామని చూసిన వారు.. తిరిగి పట్నాలకు బయల్దేరి, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు.కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటన ఏమీ వెలువడలేదు. అయితే ప్రస్తుతం ఉద్యోగాలు భర్తీ చేసే సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఖాళీలో పాత వారినే సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
నియామకాలకు బ్రేక్..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదంతోనే ఏర్పడ్డాయి. మొదటి రెండు విషయాలు పక్కన పెడితే నియామకాల్లో మాత్రం తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. తెలంగాణ వచ్చిన తరువాత టీఆర్ఎస్ అధికారం చేపట్టిన మొదటి టర్మ్లో పలు ఉద్యోగాలు భర్తీ చేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఉద్యోగాల నియామకాలు జరగలేదు. కానీ రెండో సారి అధికారం చేపట్టిన తరువాత ఉద్యోగల భర్తీకి ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో గత ఏడాదిన్నర కిందట ప్రభుత్వ పెద్దలు పలు ప్రకటనలు చేశారు. త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. దీంతో నిరుద్యోగులు మళ్లీ పుస్తకాలతో ఖుస్తీ పట్టారు. హైదరాబాద్ లోని హాస్టల్స్, రూముల్లో ఉంటూ తమ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు.
పాత వారినే సర్దుబాటు చేసే ఛాన్స్..
ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు చాలా ఏర్పడ్డాయి. ఉద్యోగులు రిటైర్డ్ అయి వెళ్లిపోవడంతో కొత్త వారిని నియమించుకోవాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి అలాంటి ప్రయత్నమేమి జరగడం లేదు. ప్రస్తుతం ఉన్న వారినే అందులో సర్దుబాటు చేయాలని చూస్తోంది. పలు శాఖల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ల ఇప్పటికీ ముఖ్య స్థానల్లో ఉన్నారు. వారి స్థానంలో ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వారిని భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వారిని అక్కడి నుంచి తప్పిస్తే పనులన్నీ పెండింగ్ లో పడే అవకాశం ఉన్నందున్న సీనియర్ అధికారులు కూడా వారిని తప్పించేందుకు ప్రయత్నం చేయడం లేదు. వారి కాలపరిమితి ముగిసినా.. కొత్త వారిని తీసుకోవడం లేదు. అక్కడ ఉన్న వారితోనే ఆ పనులు చేయించుకోవాలని చూస్తోంది.
ఖాళీగా ఉన్న వీఆర్ఏ లకు ఉపాధి హామీ పనులు..
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన నాటి నుంచి వీఆర్వోలు, వీఆర్ఏలు ఖాళీగానే ఉంటున్నారు. పలువురు వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా, ఇతర అధికారులుగా నియమించుకున్నారు. కొందరిని ప్రభుత్వం ఆదేశించే ఆయా పనుల్లో భాగస్వామ్యం చేసుకుంటున్నారు. ఎమ్ఆర్వోలు, ఇతర అధికారులు ఆయా పనుల కోసం వారిని ఉపయోగించుకుంటున్నారు. అలాగే వీఆర్ఏలను కూడా పలు సందర్భాల్లో వినియోగించుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఒక బాధ్యత అప్పగించలేదు. అయితే వారికి ఇప్పుడు ఉపాధి హామీ పనులు అప్పగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రెండేళ్ల కిందట ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. తమను తిరిగి తీసుకోవాలని వారు ఎన్నిసార్లు ఆందోళనలు, నిరసనలు తెలిపినా.. వారిని విధుల్లోకి తీసుకోవడం లేదు. ఆ పనులను ప్రస్తుతం జూనియర్ పంచాయతీ సెక్రటరీలు చూసుకుంటున్నారు. పని భారం ఎక్కువవుతోందని వారి నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుండటంతో.. వీఆర్ఏలకు పూర్తి స్థాయిలో ఆ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.