వినాయక నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ చేసే విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగి ఇద్దరు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ దారుణం జగిత్యాలలో వెలుగుచూసింది.
జగిత్యాల : వినాయక చవితి అంటేనే గల్లీగల్లీకి మండపాలు, యువత కోలాహలం, ఊరూవాడ సందడితో జరుపుకునే పండగ. ఇక వినాయక నిమజ్జనం బ్యాండ్ మోత, డిజే సౌండ్ లు, యువత తీన్మార్ డ్యాన్సులు తప్పనిసరి. కానీ కొన్నిచోట్ల ఈ సందడి శృతిమించి ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఇలా జగిత్యాలలో కూడా వైభవంగా వినాయన నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తుండగా రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగి ఘర్షణ జరిగింది. ఇందులో ఇద్దరు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే... జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడలో కొందరు యువకులు వినాయన మండపాన్ని ఏర్పాటుచేసారు. 11 రోజులు పూజలందుకున్న గణనాథున్ని నిన్న(గురువారం) నిమజ్జనం చేయడానికి నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేసారు. అయితే ఈ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న రెండు గ్రూపుల మధ్య డ్యాన్స్ చేసే విషయంలో గొడవ జరిగింది. దీంతో ఇరువర్గాల యువకులు రోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
ఇరువర్గాల ఘర్షణ మరింత ముదిరి చివరకు కత్తులతో దాడులు చేసుకునే స్థాయికి చేరింది. దీంతో సంబు రాజు, మల్లికార్జున్ అనే ఇద్దరు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి చికిత్స అందిస్తున్నా పరిస్థితి విషమంగానే వున్నట్లు సమాచారం.
Read More సికింద్రాబాద్ : నాలాలో కొట్టుకుపోయి మహిళ మృతి, పారిశుద్ధ్య కార్మికురాలిగా గుర్తింపు
ఈ ఘర్షణ, కత్తులతో దాడుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. వినాయక మండప నిర్వహకులు, స్థానికుల నుండి వివరాలు సేకరించారు. బాధిత యువకులు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.