హైద్రాబాద్లో విషాదం: హోటల్ఫుడ్ తిని నలుగురికి అస్వస్థత, రెండేళ్ల బాలుడి మృతి
హైద్రాబాద్ లోని ఓ హోటల్ లో ఫుడ్ తిని రవి నారాయణ ఆయన భార్య శ్రీవిద్య, ఏడేళ్ల వరుణ్, రెండేళ్ల విహాన్ అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు.
హైద్రాబాద్: హైద్రాబాద్లోని ఓ హోటల్ లో కలుషిత ఆహారం తిని రెండేళ్ళ బాలుడు విహాన్ మృతి చెందాడు.
అమెరికా వెళ్లేందుకు వీసా కోసం బెంగుళూరు నుండి వచ్చిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. బెంగుళూరు నుండి రవి నారాయణ, అతని భార్య శ్రీవిద్య, వరుణ్, విహాన్ లు హైద్రాబాద్ కు వచ్చారు.
మంగళవారం నాడు వీసా కోసం వీసా ఆఫీస్ కు వెళ్లి వచ్చిన తర్వాత బేగంపేటలోని హోటల్ కు వచ్చారు. అదే హోటల్ లో ఫుడ్ ఆర్డర్ చేశారు. రోటీ తిన్న తర్వాత జ్యూస్ తాగారు. ఆ తర్వాత ఈ నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బంధువులు వారిని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండేళ్ల నిహాన్ మృతి చెందాడు. రవి నారాయణ ఆయన భార్య శ్రీవిద్య ఏడేళ్ల వరుణ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఈ ఘటనపై హోటల్ పై బాధిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రవి నారాయణ కుటుంబసభ్యులు హోటల్ లో తిన్న ఆహార పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఫుడ్ ను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు.