తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తమ భూమిని అక్రమించారని మర్రి వెంకట్ రెడ్డి, దయాసాగర్ రెడ్డి‌లు ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి నుంచి తమకు ప్రాణాహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు.

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తమ భూమిని అక్రమించారని మర్రి వెంకట్ రెడ్డి, దయాసాగర్ రెడ్డి‌లు ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి నుంచి తమకు ప్రాణాహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. బషీరా బాగ్ ప్రెస్‌ క్లబ్‌లో వారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి లోని మంత్రి మల్లారెడ్డి కాలేజ్ ఎదురుగా ఉన్న సుంకరి కుటుంబానికి చెందిన 8 ఎకరాల భూమిలో 4.5 ఎకరాల భూమిని తాము కొనుగోలు చేశామని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి ఆయన భార్య పేరు మీద రెండు ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు. 

అయితే అక్కడున్న మొత్తం భూమిని అక్రమించేందుకు మంత్రి మల్లారెడ్డి కుట్ర చేస్తున్నారని మర్రి వెంకట్ రెడ్డి, దయాసాగర్ రెడ్డి‌లు ఆరోపించారు. తాము తమ భూమిలోకి వెళ్లకుండా మంత్రి మల్లారెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి బామర్ది శ్రీనివాస్ రెడ్డి గన్ తో షూట్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు. 

భూ రికార్డుల్లో తమ పేరు మార్చారని.. అక్రమంగా వారి పేరు మీదకు మార్చుకున్నారని ఆరోపించారు. రూ. 30 కోట్ల విలువ చేసే భూమిని మంత్రి మల్లారెడ్డి కొట్టేద్దామని చూస్తున్నారని అన్నారు. తమ భూమి తమకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలిపారు. మంత్రి మల్లారెడ్డి చాలా మందిని మోసం చేస్తున్నారని.. తమలాగే మేడ్చల్ జిల్లాలో చాలా మంది బాధితులు ఉన్నారని.. భయపడి ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు.