Asianet News TeluguAsianet News Telugu

ఈఎస్ఐ స్కాం: దేవికా రాణి దోపిడికి సాయం చేసింది వీరిద్దరే

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

two more arrests held in esi medical scam
Author
Hyderabad, First Published Dec 21, 2019, 5:25 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. డైరెక్టర్ దేవికా రాణితో కుమ్మక్కై నకిలీ బిల్లులు సృష్టించిన కంపెనీలపై ఏసీబీ కూపీ లాగుతోంది.

ఈ క్రమంలో శనివారం ఇద్దరిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. వీరిద్దరూ షెల్ కంపెనీ చేసిన ఐఎంఎస్ నుంచి బిల్లులు క్లయిమ్ చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. దీంతో నిందితులు భూపాల్ రెడ్డి, రెడ్డిమల్లి నాగేందర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు.

ఈఎస్ఐ స్కాంలో ఇప్పటికే దేవికా రాణితో పాటు ఫార్మాసిస్ట్ నాగలక్ష్మీ సహా మరో నలుగురిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. భూపాల్ రెడ్డి సికింద్రాబాద్‌లోని విశాల్ ఎంటర్‌ప్రైజెస్‌ను, నాగేందర్ రెడ్డి వసుధ మార్కెటింగ్‌ను నిర్వహిస్తున్నారు.

Also Read:ESI Scam: విస్తుపోయే దేవికారాణి ఆస్తులు: అమరావతినీ వదల్లేదు

వీరిద్దరూ దేవికా రాణి బినామీలుగా తెలుస్తోంది. వీరి సాయంతో ఆమె బిల్లులు క్లయిమ్ చేయించి.. ఆ సోమ్ముతో కామారెడ్డి జిల్లా బికనూర్‌లో పొలాలు కొన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. వీరిద్దరూ నకిలీ బిల్లులు పెట్టిన వెంటనే డైరెక్టర్ దేవికా రాణి అప్రూవల్ ఇచ్చేదని, వీరికి ఫార్మాసిస్ట్ నాగలక్ష్మీ సహకారం అందించేదని తెలుస్తోంది. 

మరోవైపు ఈ కేసులో దేవికారాణి ఆస్తుల చిట్టా విస్తుపోయే విధంగా ఉంది. తవ్వే కొద్దీ ఆమె ఆస్తులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఆమెకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులను గుర్తించారు. ఆస్తులను కూడబెట్టుకునే విషయంలో ఆమె దేన్ని కూడా వదలినట్లు లేదు. 

రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో తన పిల్లల పేరు మీద దేవికారాణి 9 ప్లాట్లు కొనుగోలు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గుర్తించింది. తన అల్లుడి పేరు మీద తిరుపతిలో 700 గజాల్లో జీ ప్లస్ ఫోర్ అపార్టుమెంటును కొనుగోలు చేసినట్లు కూడా ఏసీబీ గుర్తించింది. 

రావిరాల హౌసింగ్ బోర్డులో ఓ ఇంటికి రూ.25 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఈ మేరకు ఏసీబీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత సెప్టెంబర్ లో ఏసీబీ కేసు నమోదు చేసింది. దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తితో పాటు మరో 19 మందిని ఏసీబీ అరెస్టు చేసింది. 

Also Read:ఈఎస్ఐ స్కాం: దేవికా రాణితో పాటు ఏడుగురికి రిమాండ్

దేవికా రాణి ఆస్తులను మరింత వెలికి తీయడానికి ఏసీబీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. దేవికారాణి కోట్ల ఖరీదు చేసే బంగారు ఆభరణాలను, స్థిరాస్తులను, బ్యాంకులు, బీమా సంస్థల్లో ఫిక్స్డ్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. 

ఎస్బీఐలో 12 ఏఫ్డీలు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 35 లక్ష విలువైన 9 ఏఫ్డీలను ఏసీబీ గుర్తించింది. బీమా సంస్థల్లో కూడా పెద్ద యెత్తున డిపాజిట్లు చేసినట్లు గుర్తించింది. ఆ వివరాలను అందజేయాల్సిందిగా ఏసీబీ ఎస్పీ, బీమా సంస్థలకు లేఖలు రాసింది.

Follow Us:
Download App:
  • android
  • ios