అర్థరాత్రి డ్రైనేజీ క్లీనింగ్: సాహెబ్ నగర్ లో ఇద్దరిని మింగేసిన మ్యాన్ హోల్
హైదరాబాదులోని వనస్థలిపురం పరిధిలో గల సాహెబ్ నగర్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. డ్రైనేజీ క్లీన్ చేసే క్రమంలో మ్యాన్ హోల్ లోకి దిగిన ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విషాదకరమైన సంఘటన జరిగింది. మంగళవారం అర్థరాత్రి ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులను మ్యాన్ హోల్ మంగేసింది. ఈ సంఘటన వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్ లో జరిగింది.
మంగళవారం రాత్రి నలుగురు కార్మికులు డ్రైనేజీ క్లీనింగ్ కు వెళ్లారు. శివ అనే వ్యక్తి మ్యాన్ హోల్ లోకి దిగాడు. అతను ప్రమాదంలో చిక్కుకోవడంతో అతన్ని కాపాడేందుకు అనంతయ్య అనే కార్మికుడు ప్రయత్నించాడు. ఇద్దరు కూడా మ్యాన్ హోల్ లో గల్లంతయ్యారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శివ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతయ్య కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. రాత్రి పూట డ్రైనేజీ క్లీనింగ్ చేపట్టవద్దనే నిబంధనలు ఉన్నాయి. అయితే, కాంట్రాక్టర్ బలవంతంగా వారిని పనిలోకి దింపాడు.
శివ, అనంతయ్య కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇద్దరికి కూడా వివాహం అయింది. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.