నకిలీ బయోమెట్రిక్ తో  పారిశుధ్య కార్మికుల వేతనాలను  కొట్టేశారు  ఇద్దరు  ఉద్యోగులు. వీరిని  హైద్రాబాద్  సనత్ నగర్ పోలీసులు ఇవాళ  అరెస్ట్  చేశారు. 

హైదరాబాద్: నకిలీ బయోమెట్రిక్ తో పారిశుధ్య కార్మికుల జీతాలు కొట్టేస్తున్న ఇద్దరు కేటుగాళ్లను హైద్రాబాద్ సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 30 మంది పారిశుద్య కార్మికుల వేతనాలను కేటుగాళ్లు కొట్టేశారు. పారిశుద్య కార్మికుల వేలిముద్రలను సేకరించి నిందితులు వేతనాలు కొట్టేస్తున్నారని పోలీసులు గుర్తించారు. 

సుమారు 30 మంది పారిశుద్య కార్మికుల వేతనాలను నిందితులు కొట్టేశారు. ఈ విషయమై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు అభిలాష్, ఆనంద్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు నిందితులు జీహెచ్ఎంసీ శానిటరీ విభాగంలో పనిచేస్తున్నారు. 

గతంలో కూడ ఇదే తరహలో జీహెచ్ఎంసీ లో పనిచేస్తున్న ఉద్యోగుల నకిలీ బయోమెట్రిక్ తో డబ్బులు కొట్టేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎక్కువగా పారిశుద్య కార్మికులకు చెందిన వేతనాలను నిందితులు కొట్టేశారు. మరికొందరు ఉద్యోగులు విధులు రాకున్నా వచ్చినట్టుగా నకిలీ బయోమెట్రిక్ సృష్టించి వేతనాలు పొందిన ఘటనలు కూడ గతంలో చోటు చేసుకున్నాయి. 

గత ఏడాది జూలై 15న ఇదే తరహలో నకిలీ బయోమెట్రిక్ ను ఉపయోగించి మోసానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 మద్ది వెంకట్ రెడ్డి , ముస్కు లక్ష్మీ నర్సింహ్మ, కె. వెంకటేష్ లు పారిశుద్య కార్మికుల వేలిముద్రలు సేకరించి వేతనాలు స్వాహా చేశారు. నిందితుల నుండి 43 నకిలీ వేలిముద్రలు, వేలిముద్రలు సేకరించే పరికరాలను పోలీసులు సీజ్ చేశారు. 

నిందితులు ఎంసీల్, ఫెవికాల్ , మైనంతో పారిశుద్య కార్మికుల నుండి వేలిముద్రలు సేకరించారు. ఈ వేలిముద్రలతో హాజ.రు నమోదు చేస్తూ వేతనాలు స్వాహా చేస్తున్నారు.ఈ తరహా మోసం కారణంగా ప్రతి ఏటా జీహెచ్ఎంసీ రూ. 76 లక్షలు నష్టపోతుందని అధికారులు తేల్చారు.

ఈ ఏడాది జనవరి మాసంలో ఇదే తరహ ఘటన మరోకటి వెలుగు చూసింది. హైద్రాబాద్ ఖైరతాబాద్ సర్కిల్ 11 లో పనిచేస్తున్న శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ రుద్రోజు ప్రభాకర్, కాంట్రాక్టు ఉద్యోగి రాజేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. జీహెచ్ఎంసీలో పనిచేసే 24 మంది వేలిముద్రలు, బయోమెట్రిక్ పరికరాలను పోలీసులు సీజ్ చేశారు.