తెలంగాణ టీడీపీ నేతల గుండెల్లో గుబులు ఇదీ...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై టీడీపీ తెలంగాణ నేతల్లో కలవరం నెలకొంది.
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై టీడీపీ తెలంగాణ నేతల్లో కలవరం నెలకొంది. ఒకవేళ ప్రజా కూటమికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే రానున్న రోజుల్లో టీడీపీకి మరింత గడ్డుకాలం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.ఈ కూటమి ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ 13 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. గెలిచే స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం వల్ల టీఆర్ఎస్ కు రాజకీయంగా ప్రయోజనం కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకొంది.
గతంలో చోటుచేసుకొన్న ఓటుకు నోటు కేసు తర్వాత పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుండి చాలా మంది నేతలు, ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరారు.
క్షేత్రస్థాయిలోని కారయకర్తులు కూడ టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.
చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి క్యాడర్ లేకుండా పోయింది. కూకట్పల్లి లాంటి నియోజకవర్గాల్లో ఇదే రకమైన పరిస్థితి ఉందని ఆ పార్టీ నేతల్లో అభిప్రాయం లేకపోలేదు.
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ప్రజా కూటమికి వ్యతిరేకంగా వస్తే రాజకీయంగా టీడీపీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. ప్రజా కూటమికి అనుకూల ఫలితాలు వస్తే టీడీపీ రాజకీయంగా తమ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కొంత వెసులుబాటు దొరికే అవకాశం ఉంది.
ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై ఆ పార్టీ వర్గాల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తే టీడీపీ మరింత దెబ్బతినే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి పోటీ చేసి 15 అసెంబ్లీ, ఒక్క ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. అయితే ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుండి 12 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కూడ టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన మేడ్చల్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
టీడీపీ శాసనసభపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చివరికి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీలో మిగిలారు. గత ఎన్నికల్లో ఎల్బీనగర్ నుండి విజయం సాధించిన ఆర్. కృష్ణయ్య, సత్తుపల్లి నుండి గెలిచిన సండ్ర వెంకటవీరయ్యలు. ఆర్. కృష్ణయ్య ఈ ఎన్నికల్లో మిర్యాలగూడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా, సత్తుపల్లి నుండి సండ్ర వెంకటవీరయ్య మరోసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు.