దేశవ్యాప్తంగా నిర్వహించే రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంస్థ యజమాన్యానికి జేఏసీ నేతలు శుక్రవారం నోటీసు అందించారు.
మార్చి 28, 29న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెలో తమ కార్మికులు సైతం పాల్గొంటారని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ మార్చి 28 ,29 తేదీలలో దేశవ్యాప్త సమ్మె జరగనున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నిర్వహించే రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని జేఏసీ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానించారు. ఈ విషయం తెలియజేస్తూ శుక్రవారం సంస్థ యాజమాన్యానికి నోటీసు అందించినట్టు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి తెలిపారు.
బస్భవన్లోని ఆర్టీసీ ఛైర్మన్ పేషీలో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఎంవీ యాక్ట్ చట్టం-2019ను పునరుద్ధరించాలని, టూరిస్ట్ పర్మిట్ పాలసీని రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. వాటితో పాటు పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని, రాష్ట్ర వ్యాట్ను తగ్గించాలని కోరింది.
ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల ఆస్తులను ప్రైవేట్సంస్థలకు, వ్యక్తులకు కారుచౌకగా కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ సంఘాల పిలుపు మేరకు తెలంగాణలో సమ్మెను విజయవంతం చేయాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి కోరారు. ఇక, కార్మికుల హక్కులను పునరుద్ధరించాలని, పీఆర్సీ, డీఏ బకాయిలను తక్షణం చెల్లించాలని కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ డే నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇక, ఆర్టీసీ నష్టాలను పూరించేందుకు బడ్జెట్లో 2 శాతం నిధులు కేటాయించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం 1500 కోట్లు ఆర్టీసీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా చె్పారు. అందులో 1200 కోట్లు రియంబర్స్మెంట్కే పోతే.. మిగిలిన మూడు వందల కోట్లు దేనికి సరిపోవని చెబుతున్నారు. తమ డిమాండ్ను పట్టించుకోకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
