భక్తులకు ఆర్టిసి గుడ్ న్యూస్... తెలంగాణ నుండి అరుణాచలంకు ప్రత్యేక బస్సులు
తెలంగాణ నుండి తమిళనాడులోని అరుణాచలం ఆలయానికి వెళ్లాలనుకునే భక్తులకు తెలంగాణ ఆర్టిసి గుడ్ న్యూస్ చెప్పింది.
హైదరాబాద్ : తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రం అరుణాచలంను సందర్శించాలనుకునే తెలంగాణ వాసులకు టీఎస్ ఆర్టిసి గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 3న గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు... ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టిసి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసినట్లు ఆ సంస్థ ఎండీ విసి సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే అరుణాచలం టూర్ ప్యాకేజీ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభించగా వేగంగా అయిపోతున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.
తెలంగాణ ఆర్టిసి తమిళనాడు తిరువన్నమలైలోని అరుణాచలం ఆలయానికి 15 సూపర్ లగ్జరీ బస్ సర్వీసులు నడపనున్నట్లు ఆర్టిసి ఎండీ వెల్లడించారు.ఈ అరుణాచలం టూర్ ప్యాకేజీకి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందని... మొత్తం 15 బస్సులు ఏర్పాటుచేయగా ఇప్పటికే 13 బస్సుల్లో సీట్లన్ని ఫుల్ అయ్యాయని సజ్జనార్ వెల్లడించారు.రిజర్వేషన్ కల్పించిన గంటల వ్యవధిలోని భక్తులు టికెట్లను బుకింగ్ చేసుకుంటున్నారని అన్నారు.మిగిలిన రెండు బస్సుల కోసం ముందస్తు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని... వాటిలోనూ వేగంగా టికెట్స్ బుక్ అవుతున్నట్లు విసి సజ్జనార్ తెలిపారు.
ఇప్పటివరకు హైదరాబాద్ నుండి 12, వేములవాడ నుంచి 2, మహబుబ్నగర్ నుండి ఒక బస్సు అరుణాచలం యాత్రకోసం ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. భక్తుల డిమాండ్ దృష్ట్యా మరిన్నీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు కూడా తెలంగాణ ఆర్టిసి సిద్ధంగా ఉందన్నారు. అరుణాచల టూర్ ప్యాకేజీ ముందస్తు రిజర్వేషన్ కోసం టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ http://tsrtconline.in ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.