తెలంగాణలో గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీపై టీఎస్పీఎస్సీ కసరత్తు.. శాఖాధిపతులతో వరుస భేటీలు
తెలంగాణలో వీలైనంత త్వరగా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ల విడుదల చేయాలనే లక్ష్యంతో టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా వివిధ శాఖల అధికారులతో గత రెండు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తోంది.
తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ల విడుదలపై టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా వివిధ శాఖల అధికారులతో టీఎస్పీఎస్సీ సమావేశమైంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం అన్ని విభాగాల హెచ్వోడీలతో టీఎస్పీఎస్సీ సమావేశమైంది. అన్ని శాఖల్లో ఇండెంట్లను అందించాలని కమీషన్ కోరింది. కాగా.. గత రెండు రోజులుగా వ్యవసాయ, కళాశాల విద్య, గిడ్డంగుల సంస్థ, మత్య్స, సహకార, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులతో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సమావేశమైన సంగతి తెలిసిందే. సర్వీస్ రూల్స్, సవరణలు, రోస్టర్స్, క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు, అర్హతల వివరాలను తమకు అందించాలని ఛైర్మన్ కోరారు.
ఇకపోతే.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు శాఖల్లోని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ .. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మంగళవారం మరో 2,910 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో గ్రూప్ -2 663, గ్రూప్-3 1,373, పశుసంవర్ధక శాఖలో 294, గిడ్డంగుల సంస్థలో 50 పోస్టులు, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Also REad:నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ అనుమతి
కాగా.. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా చెప్పారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పిన కేసీఆర్.. వారికి శుభవార్త అందించారు. మొత్తం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మిగిలిన 80,039 ఉద్యోగాలను భర్తీ చేసేవిధంగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టుగా చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉద్యోగాల భర్తీపై దృష్టి చేశారు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.