TS TET 2022: ఒకే రోజు టెట్, ఆర్ఆర్బీ పరీక్షలు.. టెట్ వాయిదా వేయాలని అభ్యర్థన.. మంత్రి సబితా ఏమన్నారంటే..
TS TET 2022 ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నట్టుగా తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టెట్ పరీక్ష రోజే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష ఉన్నందున.. టెట్ పరీక్ష వాయిదా వేయాలని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ను కోరారు.
తెలంగాణలో టెట్ పరీక్ష నిర్వహణ తేదీపై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. TS TET 2022 ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నట్టుగా తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టెట్ పరీక్ష రోజే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష ఉన్నందున.. టెట్ పరీక్ష వాయిదా వేయాలని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా తెలంగాణ మంత్రి కేటీఆర్ను కోరారు. ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ ఉండటం వలన అభ్యర్థులు అయోమయానికి గురవతున్నారని.. టెట్ పరీక్ష వాయిదా వేయగలరని మనవి చేస్తున్నట్టుగా చెప్పారు.
ఈ ట్వీట్పై స్పందించిన మంత్రి కేటీఆర్.. దానిని పరిశీలించాల్సిందిగా మంత్రి సబిత ఇంద్రారెడ్డి ట్యాగ్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. టెట్ పరీక్షను వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. తాను విషయం వెల్లడించడానికి ముందు సంబంధిత అధికారులతో మాట్లాడానని చెప్పారు. టెట్ పరీక్షలో సుమారు 3.5 లక్ష మంది పాల్గొనున్నారని చెప్పారు. ఇతర పోటీ పరీక్షలతో క్లాష్ కాకుండా పరీక్షా తేదీలను నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇతర అన్ని అంశాలను పరిగణలు తీసుకున్న నేపథ్యంలో.. టెట్ వాయిదా కుదరదని చెప్పారు.
ఇక, జూన్ 6 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 6,29,352 అప్లికేషన్లు అందాయని చెప్పారు. వీటిలో పేపర్ 1కు 3.51,468, పేపర్ 2కు 2,77,884 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. జూన్ 6 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 5 ఏళ్ల తర్వాత టెట్ ఎగ్జామ్ను నిర్వహించడంతో ఈసారి బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు అవకాశమిచ్చామని తెలిపారు. అందుకే దరఖాస్తులు భారీగా వచ్చాయని చెప్పారు.