TS SSC Results 2022: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి.. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే..
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కొద్దిసేపటి క్రితం పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కొద్దిసేపటి క్రితం పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అధికార వెబ్సైట్లో https://www.bse.telangana.gov.in/ ఫలితాలు అందుబాటులో ఉంచారు. వెబ్ సైట్లోకి వెళ్లి రిజల్ట్ లింక్పై క్లిక్ చేసి.. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. పదో తరగతి ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టుగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలురు 87.61 శాతం సాధించగా.. బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారు.
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 97 శాతంతో మొదటి స్థానంలో, రెండో స్థానంలో నిర్మల్, మూడో స్థానంలో సంగారెడ్డి జిల్లా నిలిచాయి. హైదరాబాద్ 79 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 3,007 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మరోవైపు 15 స్కూల్స్లో ఒక్కరూ కూడా పాస్ అవలేదని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు.
రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది పరీక్షలకు హాజరు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు విద్యార్థుల విషయానికి వస్తే 819 మంది హాజరు కాగా, 425 మంది పాసయ్యారు. 51.89 శాతం ఉత్తీర్ణత సాధించారు.
కరోనా కారణంగా గత రెండుళ్లుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేశారు. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలను నిర్వహించారు. అయితే ఈసారి 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలిసిందే.