కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్- కాంగ్రెస్ రెండూ ఒకటేనని ఆయన ఆరోపించారు. పాదయాత్రతో తెలంగాణలో రాజకీయం మారిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ (trs) , కాంగ్రెస్ (congress) ఒక్కటేనన్నారు తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay). ప్రజా సంగ్రామ యాత్రలో (praja sangrama yatra) భాగంగా ఆయన గురువారం మాట్లాడుతూ.. తెలంగాణలో రాహుల్ (rahul gandhi) పర్యటనకు వచ్చి ఏం సాధిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రతో తెలంగాణలో రాజకీయం మారిందని సంజయ్ పేర్కొన్నారు. ఐదు జిల్లాల మీదుగా రెండో విడత పాదయాత్ర నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. నిరుద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లపై చాలా మంది ఫిర్యాదులు చేశారని బండి సంజయ్ వెల్లడించారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పి నేతలు పత్తా లేకుండా పోయారని ఆయన దుయ్యబట్టారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు కసిగా ఉన్నారని.. ఇతర ప్రాంతాల నుంచి పాదయాత్రకు జనాలను రప్పించలేదన్న బండి సంజయ్ తెలిపారు. ఎక్కడి వారు అక్కడే పాదయాత్రలో పాల్గొనే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. తమకు వచ్చిన విజ్ఞాపన పత్రాలను ప్రభుత్వానికి పంపామని బండి సంజయ్ చెప్పారు. ఆర్‌డీఎస్‌ సమస్యను పరిష్కరిస్తామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ పాటిల్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణలో రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని.. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్‌.

ఇకపోతే.. బండి సంజయ్ ఏప్రిల్ 14న తన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లోని జోగులాంబ దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. ఉద్యోగాలు, సాగునీరు, రైతులకు రుణ మాఫీ, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు వంటి హామీలను టీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల కోసం పోరాడేందుకు కుమార్ తన పాదయాత్రను చేపట్టారని వారు తెలిపారు.

ఇక, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నేటితో 21వ రోజుకు చేరింది. నేడు మన్యంకొండ అలివేలు మంగ ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. నేడు బండి సంజయ్ పాదయాత్ర మహబూబ్ నగర్ గ్రామీణ మండల్లాలో కొనసాగుతుంది. రేపు జరిగే సభలో జేపీ నడ్డా పాల్గొననున్న నేపథ్యంలో.. తెలంగాణలో పార్టీకి మరింత ఊపు వస్తుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మే 14వ తేదీన ముగియనుంది. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.