తెలంగాణలో ఆంధ్రా బిడ్డలు మా బిడ్డలే, లోకల్ సర్టిఫికెట్లు ఇస్తా:కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పటాన్చెరు అనేది మినీ ఇండియా అంటూ టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభివర్ణించారు. అంటే ఈ ప్రాంతంలో ఒక్క తెలంగాణ వాళ్లే కాదు, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా నివశిస్తున్నారు. అయితే ఆంధ్రా ప్రజలు ఎలాంటి టెన్షన్ పడొద్దు అంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు.
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో పటాన్చెరు అనేది మినీ ఇండియా అంటూ టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభివర్ణించారు. అంటే ఈ ప్రాంతంలో ఒక్క తెలంగాణ వాళ్లే కాదు, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా నివశిస్తున్నారు. అయితే ఆంధ్రా ప్రజలు ఎలాంటి టెన్షన్ పడొద్దు అంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు.
పటాన్ చెరు నియోకవర్గంటో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు తెలంగాణ బిడ్డలేనని స్పష్టం చేశారు. కేసీఆర్ మీతో ఉండాడు. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉంటున్నారంటే వాళ్లు మా బిడ్డలే. వాళ్లు కూడా లోకల్ సర్టిఫికెట్లు తీసుకోవచ్చని భరోసా ఇచ్చారు.
తెలంగాణలో వాళ్లకు వచ్చిన ఇబ్బంది ఏమీలేదని తెలిపారు. దొర కొడుకుల్లాగా కలిసి ఉండండి అంటూ ప్రకటించారు. మరోవైపు జీవో 58 కింద హైదరాబాద్ పరిసరాల్లో గుడిసెలు వేసుకున్న వాళ్లందరికీ పట్టాలిచ్చామని తెలిపారు.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా పట్టాలిచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు. ఎక్కడ గుడిసె వేసుకున్న వాళ్లకు అక్కడే పట్టా ఇచ్చామని ఒక్క పటాన్ చెరులోనే 5 వేల మంది జీవో 58 ద్వారా లబ్ధి పొందారని సీఎం కేసీఆర్ తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లు కచ్చితంగా చేస్తామని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆగమాగం కట్టి అవినీతి చేయదల్చుకోలేదన్నారు. ఇల్లు నిర్మించి వందశాతం ఫ్రీగా ఇస్త్తామని హామీ ఇచ్చారు. మెల్లగా అయినా పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఒక్క రూపాయి లోన్ లేకుండా ఇస్తున్నట్లు తెలిపారు.
ఖాళీ జాగ ఉన్న వాళ్లకు కూడా డబుల్ బెడ్రూం ఇండ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. ఖాళీ స్థలం ఉన్నావాళ్లకు ఉచితంగా రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. అర్బన్ ప్రాంతాల్లో అయితే ఆరున్నర లక్షలు ఉచితంగా ఇస్తామన్నారు.
అయితే ప్రజాకూటమి నేతలు మాత్రం ఖాళీ జాగ ఉన్న వాళ్లకు రూ. 5 లక్షల రుణం ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ యాడ్స్ చూడండి, ఇవ్వాళ్టి పేపర్ చూడండి. వాళ్లు ప్రకటనలు ఇచ్చారు. ఖాళీ జాగ ఉన్నవాళ్లకు డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రుణం ఇస్తారట. అంటే అప్పు ఇస్తారట. ఎస్సీ, ఎస్టీ వాళ్లకు 6 లక్షల రుణం ఇస్తారట. ఎవరికి కావాలె వీళ్ల అప్పు అంటూ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు.
పటాన్ చెరు అభ్యర్థి మహిపాల్ రెడ్డి 70 శాతం ఓట్లతో గెలుస్తాడని కొత్త సర్వే చెప్పిందని కేసీఆర్ చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హాజరైన ప్రజల్ని చూస్తే అది నిజమే అని డిక్లేర్ అయిపోయిందన్నారు. సభలోనే పటాన్ చెరు ప్రజలు మహిపాల్ రెడ్డిని గెలిపించారని చెప్పుకొచ్చారు.
సిటీతో సంబంధాలు ఉన్న పటాన్చెరుకు తప్పకుండా మెట్రో రైలు తీసుకు వస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కూడా తెచ్చుకుందామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి పోయే బాధ తప్పుతుందని తెలిపారు.
బీరంగూడ కమాన్ నుంచి కృష్ణారెడ్డిపేట వరకు 100 ఫీట్ల రోడ్తో అభివృద్ధి చేస్తామన్నారు. పటాన్చెరులో పారిశ్రామిక విధానం ఉందని, పరిశ్రమలు చాలా ఉన్నాయన్నారు. అందువల్ల పాలిటెక్నిక్ కళాశాలను తెచ్చుకుందామన్నారు.
గెలిచిన 10 రోజుల్లోనే జీవో తెచ్చుకుందామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా తొందరలోనే పటాన్ చెరు ప్రాంతానికి భగీరథ నీళ్లు రాబోతున్నట్లు సీఎం తెలిపారు. ఈసారి మహిపాల్ రెడ్డిని లక్ష మెజారిటీతో పటాన్ చెరు ప్రజలు గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు.