కవిత సాకు, అసలు కారణం ఇదీ: డీఎస్పై వేటుకు రంగం సిద్దం
డీఎస్పై కవితకు కోపమెందుకంటే?
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకొనే పరిస్థితులు కన్పిస్తున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా టీఆర్ఎస్ ఎంపీ డి. శ్రీనివాస్పై చర్యలు తీసుకొనేందుకు పార్టీ నాయకత్వం రంగం సిద్దం చేసింది. ఈ మేరకు పార్టీ నాయకత్వం డీఎస్పై ఏ క్షణంలోనైనా వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా డీఎస్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్కు బుధవారం నాడు లేఖ రాశారు.
కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై డీఎస్ అసంతృప్తితో ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాలకు కూడ ఆయన దూరంగా ఉంటున్నారు. అయితే ఈ తరుణంలో నిజామాబాద్ జిల్లాలో పార్టీని బలహీనపర్చేందుకు డీఎస్ ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకత్వం అనుమానిస్తోంది.
నిజామాబాద్ అర్బన్, రూరల్ జిల్లాలో టీఆర్ఎస్ లో గ్రూపులను డీఎస్ ప్రోత్సహిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కులాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ సమావేశాల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా డీఎస్ ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయాలను కొందరు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్ కొడుకు అరవింద్ బీజేపీలో చేరాడు. టీఆర్ఎస్ను బలహీనపర్చడం ద్వారా రాజకీయంగా తన కొడుకును బలపర్చే దిశగా డీఎస్ వ్యవహరిస్తున్నాడని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ తరుణంలోనే అరవింద్ కోసం డీఎస్ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే టీఆర్ఎస్లో గ్రూపులను డీఎస్ ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్ టీఆర్ఎస్లో కీలకంగా ఉన్న సమయలో కూడ అరవింద్ బీజేపీలో చేరడాన్ని కూడ టీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. కుటుంబం కోసం పార్టీని దెబ్బతీసేందుకు డీఎస్ ప్రయత్నం చేస్తున్నారని ఇవాళ కవిత మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించారు.
వ్యూహాం ప్రకారంగానే డీఎస్ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని కవితతో పాటు టీఆర్ఎస్ నాయకత్వం అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగానే డీఎస్ వ్యవహరశైలిని వారు ప్రస్తావిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ సభకు జనం తక్కువగా హజరయ్యారు. ఈ సభకు జనం హజరుకాకుండా చేయడంలో డీఎస్ పాత్ర ఉందని కవిత అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై కవిత కేసీఆర్ కు ఫిర్యాదు చేసిందని సమాచారం.
ఈ ఫిర్యాదుపై సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా నేతలతో చర్చించారని తెలుస్తోంది. కొందరు నేతలు కూడ డీఎస్ వ్యవహారశైలిపై అనుమానాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. డీఎస్ పార్టీలో ఉంటే రాజకీయంగా నష్టమే అనే అభిప్రాయానికి టీఆర్ఎస్ నాయకత్వం వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో ఆయనపై వేటు పడే అవకాశం లేకపోలేదని సమాచారం.
పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో డీఎస్ కూడ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లోకి వెళ్ళారని చెబుతున్నారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేందుకు మంతనాలు చేస్తున్నారని కూడ టీఆర్ఎస్ నేతలు సీఎంకు ఫిర్యాదు చేసిన లేఖలో ప్రస్తావించారు.