ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. వైఎస్ఆర్టీపీ నేతపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి, చర్యలకు షర్మిల డిమాండ్
సూర్యాపేట జిల్లాలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా లక్కవరం గ్రామంలో వైఎస్ఆర్టీపీ నేతలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలంటూ షర్మిల ధర్నాకు దిగారు.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం షర్మిల యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లక్కవరం గ్రామంలో వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల.. వెంటనే వారిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.
అంతకుముందు ప్రజాప్రస్థానంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష 31వ వారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం లక్కవరం గ్రామంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా షర్మిల ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే KCRకు మాత్రం 80వేలే కనిపిస్తున్నాయని ..ఎనిమిదేండ్లుగా నిరుద్యోగుల్ని మభ్య పెట్టింది చాలు. వెంటనే ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయడంతో పాటు కొత్త జిల్లాల వారిగా ఖాళీలను గుర్తించి, వాటిని కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి’’ అని ఆమె ట్వీట్ చేశారు.