ఇకపై వారానికి 4 సార్లు కరీంనగర్-తిరుపతి రైలు: ఎంపీ వినోద్
ఇకపై వారానికి నాలుగుసార్లు కరీంనగర్-తిరుపతిల మధ్య రైలు నడపనుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ గుప్తాతో భేటీ అయిన ఎంపీ వినోద్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే అభివృద్ధి అంశాలపై చర్చించారు.
హైదరాబాద్: ఇకపై వారానికి నాలుగుసార్లు కరీంనగర్-తిరుపతిల మధ్య రైలు నడపనుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ గుప్తాతో భేటీ అయిన ఎంపీ వినోద్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే అభివృద్ధి అంశాలపై చర్చించారు.
చాలా రోజులుగా కరీంనగర్ జిల్లా వాసుల కోరిక మేరకు, ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా కరీంనగర్ - తిరుపతిల మధ్య రైలును ఇకపై వారంలో 4 సార్లు నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరానని అందుకు రైల్వే శాఖ అంగీకరించిందని ఎంపీ తెలిపారు.
అలాగే కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని లెవల్ క్రాసింగ్ దగ్గర రూ.102 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జీ నిర్మాణానికి సైతం రైల్వే బోర్డు అనుమతినిచ్చిందని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని జీఎం వినోద్ కుమార్ గుప్తా తెలిపారు.
ఇక మనోహరబాద్ - కొత్తపల్లి మార్గంలో మనోహరాబాదు నుంచి గజ్వేల్ వరకు మార్చ్ 21, 2019 వరకు ట్రయల్ రన్ నిర్వహించేదుకు నిర్ణయించామని తెలిపారు. గజ్వేల్ నుంచి కొత్తపల్లి వరకు డిసెంబర్ 31, 2019 కల్లా రైలు నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని దానికి అనుగుణంగా పనులను చకచకా కొనసాగిస్తున్నట్లు జిఎం వివరించారని ఎంపి వినోద్ కుమార్ తెలిపారు.