పచ్చదనంతో శోభాయమానంగా నల్లమల అందాలు.. గర్వపడాలి : ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్
వర్షాకాలం ఆరంభం కావడంతో తొలకరి చినుకులకు నల్లమల అడవులు శోభాయమానంగా మారాయి. దీనికి సంబంధించిన ఫోటోలను టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల పేరు వింటేనే అభయారణ్యంతో పాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. దట్టమైన అరణ్యాలు, పశుపక్షాదుల సోయగాలతో మనసును రంజింపజేస్తుంది. అడవితల్లి ఒడిలో పారే సెలయేళ్లు.. పక్షుల కిలకిల రావాలు ఆకుపచ్చని అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. కనుచూపుమేర పచ్చదనం.. నింగిని తాకుతున్నట్లుగా కనిపించే భారీ వృక్షాలు.. పర్యాటకుల మనసును ఆహ్లాదపరుస్తాయి. ఆ అభయారణ్యంలో ఎన్నో వన్యప్రాణులు తలదాచుకుంటూ తమ మనుగడను కాపాడుకుంటున్నాయి.
అంతటి అద్భుతమైన నల్లమల అందాలను టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘ ఈ వర్షాకాలంలో నల్లమల అత్యంత అద్భుతంగా ఉందని .. ఈ అడవిలో జంతువుల సమతుల్యతను కాపాడుకోవడానికి తెలంగాణ అటవీ శాఖ, అధికారుల కృషిని తప్పకుండా అభినందించాల్సిందే. ఇలాంటి గొప్ప అటవీ ప్రాంతం ఉన్న తెలంగాణలో ఉన్నందుకు మనమంతా గర్వపడాలి’’ అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.