కేసీఆర్ , కేటీఆర్ కంటే నేనే ఎక్కువ చదువుకున్నా : రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు
తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుల కంటే తానే ఎక్కువ చదువుకున్నానని వ్యాఖ్యానించారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల కంటే తాను ఎక్కువ చదువుకున్నానని వ్యాఖ్యానించారు. మంగళవారం శంకరపట్నం మండలం కన్నాపూర్లో జరిగిన అంబేద్కర్ వర్ధంతి సభలో రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. తాను కూడా అంబేద్కర్ మాదిరిగానే చదువుకుని డాక్టరేట్, గోల్డ్ మెడల్ సాధించానని అన్నారు. పేద దళిత కుటుంబంలో పుట్టిన తాను ఉన్నత చదువులు చదువుకుని డాక్టర్ రసమయి బాలకిషన్గా మీ ముందు నిల్చున్నానని పేర్కొన్నారు. తాను టీచర్గానూ పని చేశానని, గోచి, గొంగడి పెట్టుకుని పాటలు పాడానని రసమయి గుర్తుచేశారు.
ALso REad:రాజీనామా చేయండి .. రోడ్లు పడతాయి : రసమయి బాలకిషన్కి నిరసన సెగ
ఇకపోతే... గత నెలలో రసమయి బాలకిషన్కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. గన్నేరువరం నుండి గుండ్లపల్లికి డబుల్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ యువజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ఆందోళనలకు కాంగ్రెస్ నేత కవ్వంపల్లి సత్యనారాయణ మద్దతు ప్రకటించారు.అదే సమయంలో అదే మార్గంలో వెళ్తున్న రసమయి బాలకిషన్ ను యువజన సంఘాలు అడ్డుకొనే ప్రయత్నం చేశాయి. అంతేకాదు ఆయన కారుపై దాడికి యత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకుని యువజన సంఘాల కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు.ఎమ్మెల్యే కారును అక్కడి నుండి సురక్షితంగా పంపించారు.గతంలో కూడా గన్నేరువరం మండలం అభివృద్దికి నోచుకోలేదని స్థానికులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే.