ముగిసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండో రోజు ఈడీ విచారణ.. ఏకంగా 10 గంటల పాటు ప్రశ్నల వర్షం
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండో రోజూ ఈడీ విచారణ ముగిసింది. బుధవారం ఆయనను దాదాపు 10 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఇదే సమయంలో విదేశీ టూర్లపై ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చారు మంచిరెడ్డి.
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండో రోజూ విచారించింది. బుధవారం దాదాపు 10 గంటల పాటు ఆయనను ప్రశ్నించింది. విదేశాల్లో పెట్టుబడులు, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఈడీ ఆరా తీసింది. అలాగే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బ్యాంక్ లావాదేవీలపైనా ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదే సమయంలో విదేశీ టూర్లపై ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చారు మంచిరెడ్డి.
కాగా.. 2014 ఆగస్టులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో ఆయన పర్యటించారు. అయితే విదేశీ పర్యటనలో డబ్బులు అవసరం రావడంతో అమెరికాలోని బంధువు నుంచి 2000 యూఎస్ డాలర్లను తీసుకున్నారు. అయితే తక్కువ సమయంలో రూ.88 కోట్ల లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, థాయ్లాండ్ దేశాల్లో లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. క్యాసినో, గోల్డ్మైన్లలో అక్రమ పెట్టుబడులు పెట్టినట్లగా ఈడీ అనుమానిస్తోంది. ఇటీవల ఈడీ ప్రశ్నించిన ఒకరి ద్వారా లావాదేవీలు జరిపినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ALso REad:రెండో రోజూ ఈడీ విచారణకు ఎమ్మెల్యే మంచిరెడ్డి: బ్యాంకు స్టేట్మెంట్తో హాజరు
ఇకపోతే.. 2009లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానం నుండి మంచిరెడ్డి కిషన్ రెడ్డి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టాడు. టీడీపీ ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2014లో కూడా ఇదే స్థానం నుండి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొన్ని రోజుల్లో ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2018లో ఇబ్రహీంపట్నం నుండి ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.