Balka Suman: ఇప్పటికైనా ఈటల తప్పును ఒప్పుకోవాలి.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్
ఈటల రాజేందర్ (Etela Rajender) భూములు కబ్జా చేసినట్లుగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) తెలిపారు. ఇప్పటికైనా ఈటల తప్పును ఒప్పుకోవాలని అన్నారు.
మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై (Etela Rajender) ప్రభుత్వ విప్,చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటల రాజేందర్ భూములు కబ్జా చేసినట్లుగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారని తెలిపారు. అయినా కూడా ఇప్పటికీ ఈటల రాజేందర్ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈటల తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్లతో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
‘ఈటల రాజేందర్ కుటుంబం ప్రభుత్వ, ఎస్సీ, ఎస్టీ భూములను కబ్జా చేసారని కలెక్టర్ చెప్పారు. నీతి నిజాయితీ ఉంది అంటున్న ఈటల రాజేందర్ 70 ఎకరాల భూములను ఏ విదంగా కబ్జా చేశారు..?. కలెక్టర్ ఆధారాలతో సహా చూపించారు. తప్పైందని ఈటల ముక్కు నేలకు రాయాలి. నోరు లేని పేదల భూములను లాక్కుంటారు.. పర్యావరనానికి హాని కలిగిస్తారు. మళ్ళీ వీల్లే దొంగే దొంగ అన్నట్టు ప్రవర్తిస్తారు. తప్పు అని రుజువైతే ముక్కు నేలకు రాస్తా అని ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికైనా హుజురాబాద్ ప్రజలు ఈటల తీరును గమనించాలి. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదవారికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి. అక్కడి కలెక్టర్ నిజాయితీగా పని చేస్తున్నారు. కానీ అతన్ని భయపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురయ్యయ్యో కలెక్టర్ నిగ్గూ తేల్చాలి. ఈటల కుటంబం.. అధికారులను, కలెక్టర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అధికారులపై ఈటల రాజేందర్, అతని భార్య మాటలన ఖండిస్తున్నాను’ అని బాల్క సుమన్ తెలిపారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరు దున్నపోతు మీద వాన పడ్డట్లు ఉందని బాల్క సుమన్ విమర్శించారు. ఒక వార్షిక ప్రణాళిక చేయమని అడిగితే.. ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ఇన్ని రోజులుగా నిరసన చేస్తుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. కేంద్రం మొండి వైఖరితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అసలు మనిషేనా.. అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పసుపు బోర్డు తెస్తా అన్న అరవింద్ తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ధర్మపురి అరవింద్ బట్టలూడదీసి కొట్టాలి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఏ రోజు తెలంగాణ కోసం పనిచేయలేదని ఆరోపించారు.
Also read: కలెక్టర్ ఏమైనా రాజకీయ నాయకుడా? తెరాస ప్రభుత్వానికి క్లర్క్ గా పని చేస్తున్నారా?.. ఈటెల జమున..
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో దావత్లు చేసుకుంటూ కూర్చున్నారని ఆరోపించారు. నోట్ల కట్టలు పట్టుకుని దొరికిన దొంగ రేవంత్ అని విమర్శించారు. అలాంటి వాళ్లు కేటీఆర్పై ఆరోపణలు చేస్తే ఆశర్చమేస్తుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్పైన మాట్లాడే అర్హత లేదన్నారు. విఠల్కు టీఎస్పీఎస్సీ సభ్యునిగా అవకాశం ఇచ్చి టీఆర్ఎస్ గౌరవించిందన్నారు. కానీ పదవి పోగానే టీఆర్ఎస్ ను విమర్శించడం కొందరికి ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు.
ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఒక్క ఎకరానికి ఒకసారి ముక్కు నేలకు రాస్తా అని ఈటల రాజేందర్ అన్నారు. 71 ఎకరాలు కబ్జా చేసాడు అంటే 71 సార్లు ముక్కు నేలకు రాయాలి. ఇన్ని ఎకరాలు కబ్జా చేసిన ఈటలను బీజేపీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. కలెక్టర్లను ఈటెల బెదిరిస్తున్నారు. అక్రమాలను అవినీతి పాల్పడుతున్న ఈటల రాజేందర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఈటల క్షమాపణ చెప్పాలి’ అని అన్నారు.
జమునా హేచరీస్ భూ అక్రమణలు వాస్తవమే.. మెదక్ జిల్లా కలెక్టర్..
ఇక, ఈటల రాజేందర్ కుటంబానికి చెందిన జమునా హేచరీస్ భూ అక్రమణ నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ సోమవారం వెల్లడించారు. మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో.. జమునా హెచరీస్ అక్రమణలో 70.33 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములున్నట్టుగా చెప్పారు. పేద ప్రజలకు కేటాయించిన ఈ భూములను కబ్జా చేశారని నిర్దారించినట్టుగా తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. భూ అక్రమణలకు పాల్పడిన జమునా హేచరీస్పై క్రిమినల్, సివిల్ చర్యలకు సిఫార్సు చేశారు,