కవిత లేని లోటు: నిజామాబాద్లో టీఆర్ఎస్కు బీజేపీ సవాల్
గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా ధర్మపురి అరవింద్ విజయం సాధించారు.
నిజామాబాద్:నిజామాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక వార్డులను కైవసం చేసుకొని టీఆర్ఎస్ కు రాజకీయంగా సవాల్ విసురుతోంది.
గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. సీఎం కేసీఆర్ కూతురు సిట్టింగ్ ఎంపీ కవితపై అరవింద్ విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
నిజామాబాద్ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో మాజీ ఎంపీ కవిత జిల్లాలో లేని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కన్పించిందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయా డివిజన్లలో అభ్యర్థుల ఎంపికలో కూడ సమస్యలు నెలకొన్నాయని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, మెట్పల్లి, కోరుట్ల మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తర్వాత బీజేపీ రెండో స్థానం దక్కించుకొంది. మున్సిపల్ ఎన్నికల్లో కవిత ప్రచారం చేస్తే ఫలితాలు మరోలా ఉండేవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదని టీఆర్ఎస్కు చెందిన నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కవిత ప్రచారం చేస్తే సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ వైఫల్యాలను ప్రచారంలో విస్తృతంగా చేసేది. పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో అరవింద్ ఎన్నికల సమయంలో చేసిన వాగ్ధానం అమలు కాలేదు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో బీజేపీ వాగ్దానం అమలు కాలేదు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు మరో రకంగా ఉండేవని కూడ టీఆర్ఎస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
నిజామాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. 60 వార్డుల్లో కనీసం 30 వార్డులను గెలుచుకొంటామని టీఆర్ఎస్ నాయకత్వం భావించింది. కానీ టీఆర్ఎస్ కేవలం 13 వార్డులను మాత్రమే గెలుచుకొంది.
Also read:కల్వకుంట్ల కవితకు వరుసగా రెండో షాక్: నిజామాబాదు కార్పొరేషన్ పై ఉత్కంఠ?
ఎంఐఎంకు 16 సీట్లు దక్కాయి. బీజేపీ ఎక్కువ సీట్లను గెలుచుకొంది. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ ఏడు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడంలో కవిత కీలకపాత్ర పోషించారు.
కానీ 2019 ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి కవిత ఓటమి పాలు కావడానికి ఆ పార్టీకి చెందిన నేతలు సరిగా పనిచేయకపోవడం కూడ కారణమనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో ఉంది.