తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రపై ఫైరయ్యారు టీఆర్ఎస్ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి. పెట్రోల్ ,డీజిల్ , గ్యాస్ ధర పెంచినందుకా , తెలంగాణకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్కు తరలించినందుకా నీ పాదయాత్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సంస్థలను కేంద్రం అమ్ముతోందని మండిపడ్డారు టీఆర్ఎస్ నేత (trs) , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (palla rajeshwar reddy) . ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో ఎక్కడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేదని పల్లా గుర్తుచేశారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేశామని ఆయన వెల్లడించారు. కేంద్రం ఎయిరిండియా, రైల్వేలను ప్రైవేట్పరం చేస్తోందని రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆర్టీసీపై డీజిల్ భారం మోపారని.. పల్లా ఫైరయ్యారు. గ్యాస్ రేట్లు పెంచి సామాన్యుల నెత్తిన పెను భారం మోపారని ఆయన ఆరోపించారు.
మంత్రి మల్లారెడ్డి (minister malla reddy) మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ దివాళా తీసిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ (rahul gandhi) తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని మల్లారెడ్డి ప్రశ్నించారు. 70 ఏళ్ల నుంచి కార్మికులకు స్వాతంత్య్రం లేదని.. పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు పెంచుతున్నందుకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారా అని దుయ్యబట్టారు. వరి వేస్తే కొనుగోలు చేయమని చెప్పినందుకు పాదయాత్ర అంటూ మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ (bjp), కాంగ్రెస్లను (congress) ప్రజలు తరిమి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.
అంతకుముందు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కి మంత్రి ప్రశాంత్ రెడ్డి (prasanth reddy) సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు ఇచ్చిన నిధులపై నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడని.. అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తా అని అన్నాడు వేశాడా అందుకే పాదయాత్ర చేస్తున్నావా? అని మంత్రి ప్రశ్నించారు. పెట్రోల్ ,డీజిల్ , గ్యాస్ ధర పెంచినందుకా పాదయాత్ర.. ? అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కు తరలించినందుకా నీ పాదయాత్ర అని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఒక బుడ్ధార్ ఖాన్… వరంగల్లో రాహుల్ గాంధీ రైతు సభలు పెడతారంట అంటూ మండిపడ్డారు. 70 ఏండ్లు పాలించిన మీరు రైతులకు ఎం చేశారని ఈ సభ పెడుతున్నారని నిలదీశారు ప్రశాంత్ రెడ్డి.
