వామన్ రావు దంపతుల హత్య కేసులో మూడు రోజుల పాటు విచారించిన తర్వాత పుట్ట మధును పోలీసులు అర్థరాత్రి ఇంటికి పంపించారు. తమకు అందుబాటులో ఉండాలని, ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని వారు ఆదేశించినట్లు తెలుస్తోంది.

పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత, పెద్దపల్లి మాజీ చైర్మన్ పుట్ట మధును పోలీసులు ఇంటికి పంపించారు. సోమవారం అర్థరాత్రి ఆయనను ఇంటికి పంపించారు. న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో పుట్ట మధును మూడు రోజుల పాటు పోలీసులు విచారించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. పుట్ట మధు భార్య, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజను, మార్కెట్ కమిటీ చైర్మన్ వూదరి సత్యనారాయణను కూడా పోలీసులు విచారించారు. విచారణపై రామగుండం పోలీసులు ఏ విధమైన వివరణ కూడా ఇవ్వలేదు. తమకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లకూడదని కూడా పోలీసులు ఆయనను ఆదేశించినట్లు తెలు్సతోంది.

Also Read: మూడో రోజు పుట్ట మధు విచారణ: భార్య శైలజను కూడా విచారిస్తున్న పోలీసులు

వామన్ రావు తండ్రి కిషన్ రావు ఫిర్యాదుతో పోలీసులు మధును అదుపులోకి తీసుకుని విచారించారు. ఏప్రిల్ 30వ తేదీన కనిపించకుండా పోయిన మధును పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలో మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఆయనను మూడు రోజుల పాటు రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారించారు. 

ఎందుకు పారిపోయారని పోలీసులు ప్రశ్నిస్తే తాను చేసిన పొరపాటు అదేనని పుట్ట మధు పోలీసులతో చెప్పినట్లు సమాచారం. అంతకు మించి ఆయన ఏ విషయం కూడా చెప్పలేదని అంటున్నారు.