రేపు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు: కవిత సెంటిమెంట్..!!
నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం రేపు (సోమవారం) విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత తన మొక్కు తీర్చుకున్నారు
నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం రేపు (సోమవారం) విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత తన మొక్కు తీర్చుకున్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని యూసీఫీయన్ దర్గాను సందర్శించిన ఆమె చాదర్ సమర్పించారు. ప్రతి ఎన్నికల ఫలితాల ముందు దర్గాను సందర్శించిడం కవితకు ఆనవాయితీ. దీనిలో భాగంగానే రేపటి ఫలితాల నేపథ్యంలో ఆమె యూసీఫీయన్ దర్గాలో మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ సలీమ్, స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు కవితకు స్వాగతం పలికారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో భారీ మెజార్టీ సాధిస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ అధికారులు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 4 గంటల వరకు 98.42 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఉపఎన్నికలో అభ్యర్థులు కవిత (టీఆర్ఎస్), సుభాష్ రెడ్డి (కాంగ్రెస్), లక్ష్మీనారాయణ (బీజేపీ) బరిలో నిలిచారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొత్తం 824 మంది ఓటర్లలో 24 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా.. వారిలో 8 మంది కోలుకున్నారు. మిగతా 16 మంది బాధితుల్లో 14 మంది పీపీఈ కిట్లు ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయగా.. మరో ఇద్దరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.