వడ్ల కొనుగోళ్లలో చివరికి ముద్దాయిగా మారిన టీఆర్ఎస్..?
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటనతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇరుకున పడినట్లు అయ్యింది. వానాకాలంలో పండిన ధాన్యాన్ని ఇంకా పూర్తి స్థాయిలో తెలంగాణ సేకరించలేదని కేంద్ర మంత్రి పార్లమెంట్ లో ప్రకటించారు.
వడ్ల కొనుగోళ్ల విషయంలో జరిగిన రాజకీయం ఇటీవల కాలంలో మరే విషయంలోనూ జరగలేదు. ధాన్యం సేకరణ విషయంలో తప్పు మీదంటే మీదని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. వడ్లు కొనుగోలు చేయాలంటూ రెండు పార్టీలు ధర్నాటు చేశాయి. నిరసనలు వ్యక్తం చేశాయి. చివరికి ఈ విషయం ఢిల్లీ వరకు చేరింది. వడ్ల కొనుగోళ్లపై ఏదో ఒకటి తేల్చుకొని వస్తానంటూ సీఎం కేసీఆర్ ఢిల్లీకి కూడా వెళ్లివచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ లభించకపోవడంతో ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చారు. అయితే ఇటీవల ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన పార్లమెంట్ లో చేసిన ప్రకటన టీఆర్ఎస్ను ఇరకాటంలో పడేసింది.
ఇరాకటంలో పెట్డబోయి.. ఇరకాటంలో పడిన టీఆర్ఎస్..
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీని ఇరకాటంలో పెట్టాలని టీఆర్ఎస్ భావించింది. కానీ అది సాధ్యం కాలేదు. కేంద్ర ప్రభుత్వమే వడ్లను కొనబోనని చెబుతోందని, కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు వడ్లను కొనాలని డిమాండ్ చేస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది.అందుకే వచ్చే యాసంగిలో రైతులు వరి వేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ సూచించారు. బీజేపీ నాయకులు కావాలనే రాద్ధాతం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో ప్రభుత్వం కొనవద్దని చెబుతుంటే, అదే పార్టీకి చెందిన నాయకులు ఇక్కడ పంటలు కొనాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు తీసుకోబోమని చెబుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణపై వివక్షచూపెడుతోందని ఆరోపించారు. దీంతో బీజేపీ రియాక్ట్ అయ్యింది. ఎఫ్సీఐకి తెలంగాణ నుంచి ఇంతే ధాన్యం ఇస్తానని తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని బయటపెట్టింది. పంజాబ్లో రెండు కాలాల్లో పండే పంటలు, సేకరించే విధానం మొత్తం ప్రకటించింది. దీంతో మళ్లీ టీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడింది.
https://telugu.asianetnews.com/telangana/page-3
వానాకాలం టార్గెటే ఇంకా ఇవ్వలేదు..
నిజానికి ఎఫ్సీఐ యాసంగి ధాన్యం తీసుకోబోమని ఎక్కడా చెప్పలేదు. కేవలం ఉప్పుడు బియ్యం విషయంలో మాత్రం కొన్ని షరతులు పెట్టాయి. అయితే సమస్య యాసంగి ధాన్యం చుట్టు ఉంది కానీ వానాకాలం కొనుగోళ్ల విషయంలో ఎఫ్సీఐ ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా కొనుగోలు చేస్తామని చెప్పింది. అయితే ఈ విషయంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం వహించింది. కొనుగోళ్ల ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుపుతోంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయంలో ప్రకటన చేశారు. టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తాము యాసంగి ధాన్యం కొనబోమని ఎక్కడా చెప్పలేదని అన్నారు. ధాన్యం ఎంత సేకరిస్తామనే విషయంలో ఇంకా టార్గెట్ ఫిక్స్ చేయలేదని చెప్పారు. కావాలనే ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేస్తుందని అన్నారు. వానాకాలంలో తెలంగాణలో పండిన పంటనంతా కొంటామని చెప్పారు. అయినా తాము ఇచ్చిన టార్గెట్ నే ఇంకా తెలంగాణ ప్రభుత్వం రీచ్ కాలేదని చెప్పారు. తెలంగాణలో బియ్యం నిల్వల విషయంలో తనిఖీలు నిర్వహించినప్పుడు అవకతవకలు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన సమర్ధించినట్టు ఆయ్యింది. టీఆర్ఎస్ నాయకులు మిల్లర్లతో కుమ్మక్కై కేంద్రానికి బియ్యాన్ని అమ్మేస్తున్నారని పలు సందర్భాల్లో బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే పీయూష్ గోయల్ ప్రకటనతో ఇప్పుడు తెలంగాణ రైతుల ఎదుట టీఆర్ఎస్ ముద్దాయిగా నిలబడినట్లయ్యింది.