ఆ కులం వారికే ఎక్కువ సీట్లు కేటాయించిన కేసీఆర్
ఒకే సామాజికవర్గం అభ్యర్థులకు ఏకంగా 35 స్థానాల్లో సీట్లు దక్కిన వైనం కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్న స్థానాలను పక్కన పెట్టి చూసినా.. ఇప్పటికే వచ్చిన ప్రకటన ప్రకారం.. కులాల వారీగా అభ్యర్థుల సంఖ్యను చూస్తే.. రెడ్డి సామాజికవర్గం వాళ్లకు అత్యధిక ప్రాధాన్యత దక్కిందని స్పష్టం అవుతోంది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల పోరు మొదలైంది. ఇప్పటికే కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేశారు. అంతేకాదు.. త్వరలో జరగనున్న ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించారు. అయితే.. ఆయన జాబితా ఇలా విడుదల చేశారో లేదో.. ఇలా నిపుణులు దీనిపై విశ్లేషణ చేయడం మొదలుపెట్టారు.
ఇక ఇప్పటి వరకూ ప్రకటించిన జాబితాలో కులగణన ఆసక్తిదాయకంగా ఉంది. అభ్యర్థుల ప్రకటనలో కేసీఆర్ ఎవరికి ప్రాధాన్యతను ఇచ్చారు? ఏ కులం వారు తెరాస నుంచి అత్యధిక సీట్లను పొందారు? అనే అంశాన్ని పరిశీలిస్తే... ఒకే సామాజికవర్గం అభ్యర్థులకు ఏకంగా 35 స్థానాల్లో సీట్లు దక్కిన వైనం కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్న స్థానాలను పక్కన పెట్టి చూసినా.. ఇప్పటికే వచ్చిన ప్రకటన ప్రకారం.. కులాల వారీగా అభ్యర్థుల సంఖ్యను చూస్తే.. రెడ్డి సామాజికవర్గం వాళ్లకు అత్యధిక ప్రాధాన్యత దక్కిందని స్పష్టం అవుతోంది.
105 మంది అభ్యర్థుల జాబితాలో ఏకంగా 35 మంది ‘రెడ్లు’ ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా మరి కొందరు మాజీలు, తొలిసారి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు. అయితే ఈ సామాజికవర్గం అభ్యర్థులకు మరిన్ని టికెట్లు దక్కే అవకాశాలు లేకపోలేదు. ఇంకా 14 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఆ సీట్ల విషయంలో కూడా కొంతమంది ‘రెడ్డి’ అభ్యర్థులు ఆశవహులుగా ఉన్నారు.
రెడ్ల తర్వాత ఎక్కువ ప్రాధాన్యత పొందినది బీసీలు. అన్ని బీసీ కులాల అభ్యర్థులు కలిసి తెరాస తొలి జాబితాలో 20 మంది ఉన్నారని తెలుస్తోంది. మూడో స్థానంలో ఎస్సీలున్నారు. మొత్తంగా 15 మంది ఎస్సీలు ఉండగా.. వీరిలో మాదిగలు ఎనిమిది మంది, మాల అభ్యర్థులు ఏడు మంది ఉన్నారు.