ప్రాణం మీదకు తెచ్చిన ఇన్ స్టా రీల్.. వీడియో చిత్రీకరిస్తుండగా ఢీకొట్టిన రైలు..
ఓ యువకుడు రీల్స్ చిత్రీకరణ చేస్తూ ప్రమాదం బారిన పడ్డాడు. వేగంగా వెళ్తున్న ట్రైన్ పక్కన రీల్స్ చేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
సోషల్ మీడియాలో పాపులర్ కావాలని యువత నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో సాహసాలు చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఖాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు
రైలు వస్తుండగా రీల్స్ చిత్రీకరణ చేయడానికి ప్రయత్నించి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు.
వివరాల్లోకెళ్తే.. వరంగల్ జిల్లాకు చెందిన అజయ్ అనే యువకుడు స్థానిక కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఆదివారం తన స్నేహితులతో సరదాగా గడుపుతూ.. ఖాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలోని వడ్డేపల్లి ట్రాక్పై రీల్స్ షూట్ చేయాలని ప్లాన్ చేశాడు. అనుకున్న విధంగా తన ఫ్రెండ్స్ తో వచ్చి.. ట్రాక్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పలు రీల్స్ షూట్ చేశాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్తున్న రైలు ప్రక్కన నడుచుకుంటూ వెళ్తూ.. రీల్స్ చేయాలని ప్రయత్నించాడు.
కానీ.. తాను ట్రాక్ కు ఎంత దూరంలో నడుస్తునన్న విషయం గుర్తించలేకపోయాడు. తనకు, రైలుకు మధ్య ఉన్న దూరం వల్ల ప్రమాదం జరగదని భావించాడు. కానీ, తాను రైలుకు దగ్గరగా నడవటంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న రైలు అతడ్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు ఉదుటన ఎగిరి పక్కకు పడటంతో అజయ్ కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడి స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.