మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్తో బయలుదేరారు. ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ బస్సులో వెళ్తుండగా.. ఆయన వెనక టీఆర్ఎస్ శ్రేణుల కాన్వాయ్ వెళ్తుంది.
మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్తో బయలుదేరారు. ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ బస్సులో వెళ్తుండగా.. ఆయన వెనక టీఆర్ఎస్ శ్రేణుల కాన్వాయ్ వెళ్తుంది. మార్గమధ్యలో పలువురు నేతల వాహనాలు ఈ కాన్వాయ్లో జాయిన్ అవుతున్నాయి. దాదాపు మూడు వేల వాహనాలతో కాన్వాయ్ ముందుకు సాగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ మునుగోడు పర్యటన సందర్భంగా.. ఆయన కాన్వాయ్ సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ వెళ్లే రూట్లో టీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ కూడా తన మార్గంలో ప్రజలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు బస్సులో నుంచే అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
అయితే భారీ కాన్వాయ్ వెళ్తున్న నేపథ్యంలో.. కేసీఆర్ వెళ్తున్న రూట్ను పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే హబ్సిగూడ నుంచి చౌటుప్పల్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన.. చాలా చోట్లు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఆ రూట్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్బీనగర్ వద్ద దాదాపు అరగంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక, విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే వాహనాలను చిట్యాల మీదుగా మళ్లిస్తున్నారు.
మరోవైపు భారీ కాన్వాయ్తో వెళ్తున్న నేపథ్యంలో.. కేసీఆర్ కూడా ట్రాఫిక్లో కొద్ది సేపు నిలిచిపోవాల్సి వచ్చింది. ఉప్పల్ వద్ద ఆయన కాన్వాయ్ కొంతసేపు నిలిచిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా ముందుకు కదిలింది.
ఇదిలా ఉంటే.. కాన్వాయ్గా మునుగోడుకు బయలుదేరిన మంత్రి మల్లారెడ్డి మార్గమధ్యలో సందడి చేశారు. కారు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చిన మల్లారెడ్డి డ్యాన్స్ చేస్తూ తనదైన మార్క్ను కనబరిచారు. చుట్టు చుట్టు చుట్టు చుక్కలు చూడు.. సాంగ్కు కారులో నుంచే కాలు కదిపారు. మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్ చేయడంతో కార్యకర్తలు కూడా రోడ్డుపై చిందులేశారు. అయితే ఓవైపు ట్రాఫిక్ జామ్తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మంత్రి రోడ్డుపై ఈ విధంగా చేయడంపై పలువురు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
