టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ.. సోమవారం హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్స్లో వెళ్లే వారికి అలర్ట్..
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్లో అక్టోబర్ 25న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ (TRS Plenary) సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Diversion) విధించారు.
హైదరాబాద్లోని హైటెక్స్లో అక్టోబర్ 25వ తేదీన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ (TRS Plenary) సమావేశాలు జరగునున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల జరగనుంది. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి ఆ పార్టీకి చెందిన నాయకులు హాజరుకానున్నారు. ప్లీనరీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతోపాటు దాదాపు 6వేల మంది హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో హైటెక్స్ పరిసరాలలో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశాలు ఉండటంతో.. అక్టోబర్ 25న పోలీసులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Diversion) విధించారు. హైటెక్స్, పరిసర ప్రాంతాల వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధిచిన సూచనలను Cyberabad Traffic Policeలు జారీచేశారు..
నీరూస్ ఎంపోరియం నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను సీఓడీ (అయ్యప్ప సొసైటీ, మాదాపూర్) నుంచి.. దుర్గం చెరువు, ఇన్ ఆర్బిట్ మాల్, ఐటీసీ కొహినూర్, ఐకియా, బయో డైవర్శిటీ, గచ్చిబౌలి రూట్లో మళ్లించనున్నారు.
వియాపూర్, కొత్తగూడ, హఫీజ్పేట్ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీ హిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ సైబర్ టవర్స్ జంక్షన్కు దూరంగా.. రోలింగ్ హిల్స్ AIG హాస్పిటల్, ఐకియా, ఇనార్బిట్, దుర్గం చెరువు వైపు మళ్లించనున్నారు.
ఆర్సి పురం, చందానగర్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకు వచ్చే వాహనాలు ఆల్విన్-కొండాపూర్ మార్గంలో వెళ్లకుండా.. బీహెచ్ఈఎల్, నల్లగండ్ల, హెచ్సీయూ, ఐఐఐటీ, గచ్చిబౌలి రోడ్డు వైపు మళ్లించవచ్చని అధికారులు చెప్పారు. మాదాపూర్ జోన్లో పగటిపూట ట్రాఫిక్ సజావుగా సాగేందుకు భారీ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించనున్నట్టుగా చెప్పారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని గమనించి.. ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని కోరారు.
Also read: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్.. అక్టోబరు జీతాల్లో కోత..!
ఇక, సోమవారం హైటెక్స్లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ఫ్లీనరీకి ఎంపికచేసిన ప్రతినిధులే రావాలని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రతినిధులందరూ గులాబీ డ్రెస్కోడ్ను పాటించాలని సూచించారు. అన్ని జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్టు తెలిపారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్లీనరీ ప్రాంగణంలో 6,500 మందికి, ప్రాంగణానికి బయట ప్రతినిధులతో వచ్చే దాదాపు 4వేల మందికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.