తెలంగాణ కోడలే అయినా ఆమెది రాయలసీమ రక్తమే: షర్మిలపై జగ్గారెడ్డి
ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆమె సోదరి షర్మిలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీరియస్ విమర్శలు గుప్పించారు. కొత్త పార్టీ అంటూ డ్రామాకు షర్మిల తెరలేపారని విమర్శించారు. జల వివాదం విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణ కోడలే అయినా ఆమెది రాయలసీమ రక్తమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు.శనివారం నాడు ఆయన హైద్రాబాద్ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.ఏపీలో అన్న, ఇక్కడ చెల్లె ప్రజలు మభ్య పెడుతున్నారని జగన్, షర్మిలపై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.
కొత్త పార్టీ అంటూ షర్మిల కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. షర్మిల పార్టీ పెట్టడం వెనుక బీజేపీ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. జగన్ ఏ విషయంలో కూడ బీజేపీ పై విమర్శలు చేయడం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు రోడ్లపై ఆందోళనలు చేస్తున్నా కూడ జగన్ ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
జలవివాదం పేరుతో ప్రాంతాల మధ్య రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు.జల వివాదంపై ఇద్దరు సీఎంలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అయితే ఈ సమస్యను మరింత పెద్దది చేస్తూ ప్రజల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇద్దరు సీఎంలు జల వివాదాన్ని తెరమీదికి తీసుకొచ్చారన్నారు. కరోనాతో ప్రజలు ఇబ్బందిపడుతోంటే ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే జలవివాదాన్ని వాడుకొంటున్నారని ఆయన చెప్పారు.