తెలంగాణలో ఐపీఎస్ల బదిలీలు.. కీలకపోస్ట్లన్నీ వాళ్లకేనా , తెలుగువాళ్లు పనికిరారా : కేసీఆర్పై రేవంత్ ఫైర్
తెలంగాణలో ఈరోజు పలువురు ఐపీఎస్లు బదిలీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. డీజీపీ సహా ఆరు కీలక పోస్టుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు వారు లేరని ఆయన ఫైర్ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం ఈరోజు చేసిన ఐపీఎస్ బదిలీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కీలక పదవులన్నీ బీహార్ రాష్ట్రానికి చెందిన వారికే కట్టబెడుతున్నారని.. పదవుల కేటాయింపులో తెలుగువారు గుర్తుకు రావడం లేదా అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానియా, రజత్ కుమార్, అధర్ సిన్హా, వికాస్ రాజ్ వంటి బీహార్కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్లకు ముఖ్యమైన శాఖలు, కీలక పదవులు కట్టబెట్టారని రేవంత్ విమర్శిస్తున్నారు. తాజాగా ఇన్ఛార్జ్ డీజీపీ పదవిని కూడా అంజనీ కుమార్కు అప్పగించడంతో రేవంత్ ఫైర్ అయ్యారు.
కాగా... తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జీ డీజీపీగా అంజనీకుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారంనాడు ఉత్తర్వలు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31వ తేదీన రిటైర్ కానున్నారు. దీంతో ఇంచార్జీ డీజీపీగా అంజనీకుమార్ ను ప్రభుత్వం నియమించింది. 1990 బ్యాచ్ కు చెందిన అంజనీకుమార్ 2018 మార్చి 12న హైద్రాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయనను ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి రిటైర్ కానుండడంతో ముగ్గురు ఐపీఎస్ పేర్లను యూపీఎస్ సీకి ప్రభుత్వం పంపింది. అంజనీకుమార్ తో పాటు 1990 బ్యాచ్ కు చెందిన రవిగుప్తా , 1989 బ్యాచ్ కు చెందిన ఉమేష్ షరాఫ్ లు పేర్లు ప్రధానంగా విన్పించాయి. ఉమేష్ షరాఫ్ రిటైర్మెంట్ కు ఆరు మాసాలే సమయం ఉంది. రవిగుప్తా,అంజనీకుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు ప్రభుత్వం అంజనీకుమార్ వైపే మొగ్గు చూపింది.
ALso REad: తెలంగాణ ఇంచార్జీ డీజీపీ గా అంజనీకుమార్ : పలువురు ఐపీఎస్ ల బదిలీలు
తెలంగాణ డీజీపీగా ఉన్న అనురాగ్ శర్మ రిటైర్ కావడంతో మహేందర్ రెడ్డిని డీజీపీగా తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.1966 జనవరి 28న అంజనీకుమార్ జన్మించారు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన కిరోరిమాల్ కాలేజీ, పాట్నాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. ఐపీఎస్ ట్రైనింగ్ సమయంలో అత్యుత్తమ హర్స్ రైడర్ గా అంజనీకుమార్ నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డీజీపీ మహేందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో రెండు వారాలు సెలవు పెట్టడంతో ఇంచార్జీ డీజీపీగా అంజనీకుమార్ వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇకపోతే.. ఈరోజు సీఐడీ చీఫ్ గా మహేష్ భగవత్ గా నియమించింది ప్రభుత్వం.ప్రస్తుతం ఆయన రాచకొండ సీపీగా ఉన్నారు.రాచకొండ కమిషనరేట్ ఏర్పడిన నాటి మహేష్ భగవత్ సీపీగా కొనసాగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మహేష్ భగవత్ ను బదిలీ చేయాలని కూడా ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ డీజీపీగా రవిగుప్తా, రాచకొండ సీపీగా డీఎస్ చౌహన్ , శాంతిభద్రతల డీజీగా సంజయ్ కుమార్ జైన్ , అగ్నిమాపక శాఖ డీజీగా జితేందర్ లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.