సైదాబాద్ ఘటనపై స్పృహలో ఉండే కేటీఆర్ ట్వీట్ చేశారా?: రేవంత్ ఫైర్
సైదాబాద్ సింగరేణి కాలనీలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా కేటీఆర్ స్పృహలో ఉండే ట్వీట్ చేశారా అని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ కు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. వ్యసనపరులకు తెలంగాణ స్వర్గథామంగా మారిందని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్:వ్యసనపరులకు తెలంగాణ స్వర్గథామంగా నిలించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందిన దగ్గరి బంధువులే పబ్ లు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం నాడు హైద్రాబాద్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా మంత్రి కేటీఆర్ ఐదు రోజుల క్రితమే ట్విట్టర్ వేదికగా ప్రకటించాడని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఐదు రోజుల తర్వాత నిందితుడు రాజు ఆచూకీ చెబితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారని రేవంత్ ప్రస్తావించారు. కేటీఆర్ స్పృహలో ఉండే ఈ ట్వీట్ చేశారా అని ఆయన ప్రశ్నించారు.
also read:సైదాబాద్లో మైనర్ బాలికపై రేప్, హత్య: బాధిత కుటుంబానికి షర్మిల పరామర్శ
మంత్రి కేటీఆర్ కు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులను ఉద్యోగం నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేరాల పెరుగుదలకు మద్యం అమ్మకాలతో పాటు డ్రగ్స్ కూడా కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు రెట్టింపయ్యాయన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు మద్యమే కారణమన్నారు.
2017లో డ్రగ్స్ కేసును నీరుగార్చారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో కొందరినే విచారించి మిగిలినవారిని వదిలేశారన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో లోతైన దర్యాప్తు చేయాలని తాను గతంలో సీబీఐ, ఈడీ పలు కీలక అధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో ఈ కేసును ఎక్సైజ్ శాఖ తూతూ మంత్రంగా విచారణ చేసిందన్నారు. ప్రస్తుతం ఈడీ విచారణకు తాను చేసిన ఫిర్యాదే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.