పెద్దగా చదువుకోలేదు కదా.. అందుకే అర్ధం పర్థం లేని నిర్ణయాలు: మోడీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దగా చదువుకోకపోవడం వల్లే ప్రధాని మోడీ హడావుడి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీపై (narendra modi) టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన విధానం లేకుండా అర్ధం పర్థం లేని పథకాలన్ని ప్రధాని మోడీ సర్కారు తీసుకొస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. పెద్దగా చదువుకోకపోవడం వల్లే మోడీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ రేవంత్ దుయ్యబట్టారు. అగ్నిపథ్ పథకాన్ని (agnipath) ఉపసంహరించుకుని ప్రధాని క్షమాపణలు చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆయుధాలు వాడటం ఎలా అన్నది నాలుగేళ్లు నేర్పించి బయటకు పంపితే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నట్లు రేవంత్ తెలిపారు.
భారతదేశంలో జనాభాకు ఉద్యోగావకాశాలకు పొంతనలేదని ఆయన అన్నారు. 22 సంవత్సరాలకు ఆర్మీ నుంచి బయటకు వస్తే.. 70 ఏళ్లు వచ్చే వరకు అభ్యర్ధికి ఎలాంటి ఉద్యోగం లేకుండా గాలికి తిరగాల్సిన పరిస్ధితి వుంటుందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్ధితుల్లో అసాంఘిక శక్తులతో చేతులు కలిపినా.. తీవ్రవాదం వైపు మళ్లినా , ఉద్యోగావశాలు లేక ప్రభుత్వంపై తిరగబడ్డా మొత్తం దేశ భద్రతకే ప్రమాదం వస్తుందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ ఇలాంటి అర్ధం పర్ధం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
మరోవైపు.. అగ్నిపథ్ నిరసనల్లో పాల్గొని కేసుల్లో నమోదైన ఆర్మీ అభ్యర్థులకు న్యాయ సహాయం చేస్తామని రేవంత్ రెడ్డి శుక్రవారం అన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చంచల్గూడ జైలులో ఉన్న సికింద్రాబాద్ స్టేషన్లో నిరసనలు నిర్వహించిన ఆందోళనకారులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి పరామర్శించారు. జైల్లో ఉన్న ఆందోళనకారులను కలిసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వారికి లీగల్ హెల్ప్ చేస్తామని తెలిపారు. ఫిట్నెస్, మెడికల్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తప్పనిసరిగా వ్రాతపరీక్షలు నిర్వహించి వారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులపై పెట్టిన కేసులను కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“సైన్యంలో చేరాలనుకునే వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే. రిమాండ్లో ఉన్న ఈ పిల్లల తల్లిదండ్రులకు వారి ఆచూకీ గురించి తెలియదు. భవిష్యత్తులో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఉండేందుకు వారిపై హత్యాయత్నం, ఇతర నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టారు. తాము ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదని పిల్లలు చెప్పారు' అని రేవంత్ రెడ్డి మీడియాతో అన్నారు. ఆందోళనకారులపై కేసుల విషయంలో టీఆర్ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై రేవంత్ విమర్శలతో విరుచుకుపడ్డారు. “సికింద్రాబాద్ నిరసనకారుడు డి రాకేష్ మరణంపై టీఆర్ఎస్ మొసలి కన్నీరు కార్చింది.. అయితే ఈ ఆర్మీ ఆశావహులపై జైల్లో కేసులు పెట్టింది. ఈ అంశంపై టీఆర్ఎస్ మాట్లాడటం లేదు.. కానీ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.