మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి కోడలు లాంటి వాడినని..  పుట్టిల్లు అయిన టీడీపీ నుంచి మెట్టినిల్లు అయిన కాంగ్రెస్‌లోకి వచ్చానని రేవంత్ పేర్కొన్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మనిషి కాంగ్రెస్ పార్టీలో వుంటాడా అని ఆయన ప్రశ్నించారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా కాంగ్రెస్ మనిషేనని రేవంత్ గుర్తుచేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి కోడలు లాంటి వాడినని ఆయన అన్నారు. పుట్టిల్లు అయిన టీడీపీ నుంచి మెట్టినిల్లు అయిన కాంగ్రెస్‌లోకి వచ్చానని రేవంత్ పేర్కొన్నారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే టీడీపీలోకి వెళ్లారని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో బిడ్డగా టీడీపీ గౌరవం నిలబెడితే.. ఇప్పుడు కోడలిగా కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తానని రేవంత్ స్పష్టం చేశారు. 

మునుగోడు ఉపఎన్నికలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి మద్ధతుగా సంస్థాన్ నారాయణ పురం మండలంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను అడ్డు తొలగించుకునేందుకు కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టారని, పేదల పక్షాన కొట్లాడి జైలుకెళ్లానే తప్పించి దొంగతనం చేసి జైలుకు పోలేదన్నారు. తాను తిన్న చిప్పకూడు సాక్షిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్ స్పష్టం చేశారు. 

ALso REad:ఈడీ పేరిట వేధింపులు: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాలకు సరైన రోడ్లు వేయలేని వారు.. ఇక్కడ అభివృద్ధి చేస్తారా అని మండిపడ్డారు. అభివృద్ది చేయని వారికి ఓట్లు అడిగే హక్కు కూడా లేదని తేల్చిచెప్పారు. గతంలో కమ్యూనిస్ట్‌లను అవమానించిన కేసీఆర్‌.. ఇప్పుడు వాళ్ల కాళ్లు పట్టుకుంటున్నారని రేవంత్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ నుంచి పార్టీలు మారేవారే కోసం బీజేపీ, టీఆర్ఎస్‌లు గోతికాడి నక్కల్లా ఎదురుచూస్తున్నాయని టీపీసీసీ చీఫ్ చురకలంటించారు. 

కాగా.. నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలకు ఈడీ నుండి నోటీసులు ఇచ్చినట్టుగా మీడియాలో కథనాలు రావడం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఆగస్టు 3 వ తేదీన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. దీనిపై సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కేంద్రం కుట్రతోనే కాంగ్రెస్ నాయకులకు నోటీసులు జారీ చేస్తున్నారన్నారు. జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర స్థాయి నేతలను కూడా కేసులతో వేధిస్తున్నారని వాటికి తాము భయపడబోమని భట్టి స్పష్టం చేశారు.