పీసీసీ ఎంపిక అయిపోయింది.. ఇక అందరం ఒక్కటే, ఎవరితోనూ విబేధాలు లేవు: రేవంత్ వ్యాఖ్యలు
పీసీసీ నిర్ణయం అయిపోయాక అందరం ఒక్కటేనన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ జెండా చివరి దాకా మోసినోడే తన బంధువని రేవంత్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉప ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ పథకాలు అమలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఎన్నికలుంటే తప్ప.. కొత్త పథకాలు రావని రేవంత్ ఎద్దేవా చేశారు. 118 నియోజకవర్గాల్లో దళితులకు న్యాయం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు దళిత దండోరా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. లక్ష మందితో ఇంద్రవెల్లి నుంచి దళిత దండోరా యాత్ర నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రేమ్సాగర్ రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
Also Read:వెంటాడి.. పక్కటెముకలు విరిగేలా కొట్టారు: పోలీసులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం
ఎవరికీ ఏ పదవి ఇవ్వాలన్నది అధిష్టానం నిర్ణయమేనని ఆయన తెలిపారు. ప్రేమ్సాగర్ రావు.. తన అభిప్రాయం ఇన్ఛార్జికి చెప్పి వుంటారని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఎవరి అభిప్రాయం వారిదన్న ఆయన అందరి అభిప్రయాలు గౌరవిస్తానని తేల్చి చెప్పారు. పీసీసీ నిర్ణయం అయిపోయాక అందరం ఒక్కటేనన్న రేవంత్... రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ జెండా చివరి దాకా మోసినోడే తన బంధువని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే పదవులు ఇస్తామని రేవంత్ వెల్లడించారు.