వెంటాడి.. పక్కటెముకలు విరిగేలా కొట్టారు: పోలీసులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం
తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బల్మూరి వెంకట్ను పోలీసులు టార్గెట్ చేసి పక్కటెముకలు విరిగేలా బలంగా కొట్టారని ఆయన ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చలో రాజ్భవన్ పేరుతో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద చేపట్టిన మహా ధర్నాలో పోలీసుల అత్యుత్సాహం వల్లే ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గాయపడ్డారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, అంజన్కుమార్ యాదవ్తో కలిసి రేవంత్ నారాయణగూడలోని ఆయన నివాసంలో వెంకట్ను కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాడ్లాడుతూ.. బల్మూరి వెంకట్కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
Also Read:ఎన్ఎస్యూఏ అధ్యక్షుడిని వెంటాడి అరెస్ట్ చేసిన పోలీసులు.. రేవంత్ ఆగ్రహం
ఈ ఘటనపై డీజీపీ, మానవ హక్కుల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా పౌరులు, ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేస్తున్నారన్నారని రేవంత్ ఆరోపించారు. బల్మూరి వెంకట్ను పోలీసులు టార్గెట్ చేసి పక్కటెముకలు విరిగేలా బలంగా కొట్టారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో వెంకట్ చురుగ్గా పాల్గొంటునందుకే పోలీసులు దాడి చేసి వెంకట్ను గాయపరిచినట్లు రేవంత్ ఆరోపించారు.