తెలంగాణలో అమలవుతున్న పథకాలు.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉంటే తాను రాజీనామా చేస్తానన్న మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అందుకోసం కేటీఆర్కు నెల రోజుల సమయం ఇస్తున్నానని ఆయన అన్నారు.
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్టు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) ప్రకటించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మరే రాష్ట్రంలో చూపించినా పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎల్పీ భేటీ సందర్భంగా దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఓసారి చత్తీస్గఢ్లో ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారో కేటీఆర్ చూడాలంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణలో కంటే మెరుగైన సంక్షేమ పథకాలు చత్తీస్గఢ్లో ఉన్నాయని .. అక్కడ వరికి రూ.2,500 మద్దతు ధర ఇస్తున్నారని రేవంత్ వెల్లడించారు. కావాలంటే చత్తీస్గఢ్ (chhattisgarh) సర్కారుతో మాట్లాడి కేటీఆర్ను అక్కడికి తీసుకెళతానని వ్యాఖ్యానించారు. వరి వేస్తే ఉరే అని టీఆర్ఎస్ సర్కారు అంటోందని, దీనిపై కేటీఆర్ చర్చకు వస్తారా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్ సవాలుకు తాను స్పందించానని, మరి తన సవాలుకు కేటీఆర్ స్పందిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. అందుకోసం కేటీఆర్కు నెల రోజుల సమయం ఇస్తున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా.. శనివారం ఎల్లారెడ్డిపేట్ మండలం వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందని.. రాజకీయం, ప్రజాజీవితంలో సంతోషం ఎక్కడ అనిపిస్తుందంటే.. ఇది పేదవాడి ప్రభుత్వమని సునీత చెప్పినప్పుడు సంతోషమేసిందని కేటీఆర్ అన్నారు.
అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని.. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నామని మంత్రి గుర్తుచేశారు. మీరు పరిపాలించే రాష్ట్రంలో ఇలాంటి ఇండ్లను నిర్మించారా? అని బీజేపీ, కాంగ్రెస్ నేతలను కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్షన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి పథకాలు అమలవుతున్నాయో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రభుత్వ పథకాల అమలుపై చర్చకు మీరు ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరికి వస్తానని కేటీఆర్ సవాల్ చేశారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాలు.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉంటే తాను రాజీనామాకు సిద్ధమంటూ సవాల్ చేశారు కేటీఆర్. కులం, మతం పిచ్చితో రెచ్చగొడుతున్నారంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. విమర్శలు చేసే ముందు ఏం చేశారో చెప్పాలని... ప్రతి గ్రామంలో ఆశించినంత అభివృద్ధి జరుగుతోందని కేటీఆర్ తెలిపారు. సర్కార్ హాస్పిటల్స్లో రోగుల సంఖ్య పెరిగిందని.. వెంకటాపూర్ కూడా అభివృద్ధి బాటలో ముందుకెళ్తోందని మంత్రి చెప్పారు. సిరిసిల్ల రూపుమార్చిన ఘనత సీఎం కేసీఆర్కే (kcr) దక్కుతుంది అని కేటీఆర్ ప్రశంసించారు.
