నేడు హైదరాబాద్ లో ‘జీరో షాడో డే’ ఆవిష్కృతం కానుంది. దీనిని ఆస్వాదించేందుకు బిర్లా ప్లానిటోరియం అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. నేటి మధ్యాహ్నం 12.22 గంటలకు జీరో షాడో ఏర్పడనుంది.
ఈ ఏడాదిలో రెండో సారి నేడు (గురువారం) ‘జీరో షాడో డే’ ఆవిష్కృతం కానుంది. హైదరాబాద్ లో ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా ప్లానిటోరియం అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12.22 గంటలకు 'జీరో షాడో డే' దృగ్విషయాన్ని ఆసక్తిగా వీక్షించేలా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో, ముఖ్యంగా మకర రేఖ, కర్కాటక రేఖ మధ్య సంవత్సరానికి రెండుసార్లు 'జీరో షాడో డే' జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన సంఘటనలో సూర్యుడు భూమధ్యరేఖకు నేరుగా ఎగువకు వస్తాడు. దీనివల్ల భూమిపై ఉన్న వస్తువులు, జీవుల నీడ ఏర్పడదు. ఈ ఏడాది మొదటి సారి మే 9న హైదరాబాద్ లో ఇది ఏర్పడింది.

‘‘దీనిని ఆస్వాదించడానికి సూర్యుడు నేరుగా పడే బహిరంగ ప్రదేశంలో ఉండాలి. చుట్టూ ఎత్తైన భవనాలు, చెట్లు లేదా నీడలను కలిగించే ఇతర అడ్డంకులు ఉండకుండా చూసుకోవాలి. సరిగ్గా నేటి మధ్యాహ్నం 12:22 గంటలకు సూర్యుడు నేరుగా నెత్తిపైకి వచ్చిన సమయంలో బహిరంగ ప్రదేశంలో నిలబడాలి. ఆ సమయంలో నీడ అదృశ్యమవుతుంది. దీని వల్ల ‘జీరో షాడో’ ఆస్వాదించే అవకాశం మీకు లభిస్తుంది’’ అని బిర్లా ప్లానిటోరియం సీనియర్ అధికారి ఒకరు ‘ది హన్స్ ఇండియా’తో తెలిపారు. కొంత సమయం పాటు నీడ కనిపించదని ఆయన పేర్కొన్నారు.
