భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం మొత్తం ట్రాఫిక్ జామ్ లో రోజూ నరకం అనుభవిస్తోంది. ఇదిలా ఉంటే ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఓ ఆలోచన చేశారు.

భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోన్న సంగతి తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రహదారులపై మోకాలి లోతు వరకు వరద నీరు చేరుకుంటోంది. దీంతో నగరంలో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలకు నెలవైన సైబరాబాద్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో వాహనాలు కిలోమీటర్ల కొద్ది బారులు తీరుతూ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. నగర పరిధిలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ‘‘ లాగౌట్ ’’ పేరుతో కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని ఆగస్ట్ 1 వరకు పొడిగిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు బుధవారం ప్రకటించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అసలేంటీ లాగౌట్ :

పోలీసులు ఇఛ్చిన సూచనల ప్రకారం ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు మూడు విడతల్లో లాగౌట్ చేయాల్సి వుంటుంది. ఐకియా – సైబర్‌ టవర్స్‌ వరకు వున్న ఐటీ కార్యాలయాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు. ఐకియా – బయోడైవర్సిటీ వరకు ఐటీ ఆఫీసుల్లో సాయంత్రం 4.30 గంటలకు లాగౌట్‌ చేయాల్సి వుంటుంది. అలాగే ఐకియా – రాయదుర్గం వరకు వున్న ఐటీ కార్యాలయాల్లో సాయంత్రం 4.30 గంటలకు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య లాగౌట్‌ చేయాలని పోలీసులు సూచించారు. గచ్చిబౌలిలోని ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య లాగౌట్‌ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.