కొత్త పోరుకు షురూ
ప్రజా సమస్యలపై విసృతస్థాయిలో చర్చించిన టీ జేఏసీ పలు తీర్మానాలతో కొత్త పంథాలో పోరుకు సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధాలు తమ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు ఈ రోజు తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్ కమిటీ విసృతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రత్యేక తీర్మానాలు చేసి వాటిపై పోరాడాలని నిర్ణయించింది.
ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, రాజ్యాంగ విలువలను మరిచి ప్రస్తుత పాలకులు వ్యహరిస్తున్నతీరుపై జేఏసీ నేతలు మండిపడ్డారు.
ఆంధ్రా పాలకుల్లాగే నేటి సర్కారు అధికారాన్ని సొంత ఆస్తిగా వాడుకుంటుందని విమర్శించారు. తెలంగాణలో రాజకీయమే వ్యాపారంగా మారుతోందని వాపోయారు.
ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచినా ఏ పార్టీలోకి మారిపోయారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి అవగాహన కల్పించి వాటిపై పోరాటం చేయాలని కొన్ని తీర్మానాలు చేశారు.
ముఖ్యంగా నిరుద్యోగం, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగం, బడ్జెట్ లో కేటాయింపులు, మహిళా సాధికారత, వ్యవసాయ సంక్షోభం, ఉద్యమకారుల దీనస్థితి, కార్పొరేట్ స్కూల్ ల ఫీజు మాఫియా, ఉద్యోగుల క్రమబద్దీకరణ ఇతర సమస్యలు, హైకోర్టు విభజన, ధర్నా చౌక్ తరలింపు, జర్నలిస్టులు, వికలాంగులు, ఆదివాసీల సమస్యలు, తెలంగాణలో సినిమా ఇండ్రస్ట్రీకి ప్రొత్సాహం తదితర అంశాలపై ప్రత్యేక తీర్మానాలను జేఏసీ ఆమోదించింది.