హైద్రాబాద్లో విషాదం: కరోనాతో ఉదయం కొడుకు మృతి, రాత్రి పేరేంట్స్ మృతి
కరోనాతో ఉదయం కొడుకు మృతి చెందారు. కొడుకు మరణించిన కొన్ని గంటల్లోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
హైదరాబాద్: కరోనాతో ఉదయం కొడుకు మృతి చెందారు. కొడుకు మరణించిన కొన్ని గంటల్లోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. హైద్రాబాద్లోని కాప్రా సర్కిల్ పరిధిలోని వంపుగూడకు చెందిన వ్యాపారి పీసరి జనార్ధన్ రెడ్డి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. వీరికి హరీష్ రెడ్డి అనే కొడుకు ఉన్నాడు. హరీష్ రెడ్డికి గత ఏడాది ఆగష్టు మాసంలో వివాహమైంది. జనార్ధన్ రెడ్డి 60వ పుట్టినరోజును పురస్కరించుకొని గత నెల 18వ తేదీన కుటుంబమంతా డార్జిలింగ్ పర్యటనకు వెళ్లారు. విహారయాత్రకు వెళ్లిన ఆ కుటుంబం గత నెల 21వ తేదీన హైద్రాబాద్కు తిరిగి వచ్చారు.
డార్జిలింగ్ నుండి వచ్చిన మరునాడు ఏప్రిల్ 22వ తేదీన హరీష్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆయన కరోనా పరీక్షలు నిర్వహించుకొంటే నెగిటివ్ వచ్చింది. అయినా ఆయనకు జ్వరం తగ్గలేదు. గత నెల 26న మరోసారి ఆయన కరోనా పరీక్షలు నిర్వహించుకొన్నాడు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనాగా నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు కుటుంబసభ్యులు ఇంట్లోనే చికిత్స తీసుకొంటున్నారు.
అయితే ఆరోగ్యం క్షీణించడంతో మే 1 హరీష్ రెడ్డి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో హరీష్ రెడ్డి తండ్రి జనార్ధన్ రెడ్డికి, తల్లి జ్యోతికి ఈ నెల 5న కరోనా నిర్ధారణ అయింది. దీంతో వీరిద్దరూ కూడ సుచిత్ర వద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 9వ తేదీన ఉదయం హరీష్ రెడ్డి కరోనాతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మరణించాడు. హరీష్ రెడ్డి మరణించిన రోజు రాత్రి 9 గంటల సమయంలో జనార్ధన్ రెడ్డి చనిపోయారు. జనార్ధన్ రెడ్డి మరణించిన గంటకే ఆయన భార్య జ్యోతి కూడ మృతి చెందింది.